అడ్డగోలు దోపిడీ... హైదరాబాద్లో ఓ కార్పోరేట్ ఆస్పత్రి నిర్వాకం... తల్లీబిడ్డలను నిర్బంధించి...
హైదరాబాద్లోని కొన్ని కార్పోరేట్ ఆస్పత్రులు పేషెంట్లను అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. తాజాగా ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి దోపిడీ నిర్వాకం బయటపడింది. ఇటీవల డెలివరీ కోసం ఓ మహిళ ఆ ఆస్పత్రిలో చేరగా రూ.1.80 లక్షలు మొత్తం ప్యాకేజీగా చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యం చెప్పినట్లే డెలివరీ సమయానికి డబ్బు చెల్లించేశారు. కానీ ఆ తర్వాత ఆస్పత్రి యాజమాన్యం మరింత డబ్బు డిమాండ్ చేసింది. అంత డబ్బు తాము కట్టలేమని చెప్పడంతో డెలివరీ అయిన మహిళను,ఆమెకు జన్మించిన శిశువును ఆస్పత్రి యాజమాన్యం నిర్బంధించింది.
ఆస్పత్రి నిర్వాకంతో ఆ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. ఇప్పటికే రూ.1.80లక్షలు చెల్లించామని... కానీ కాన్పు జరిగాక రూ.3లక్షలు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. బిల్లు చెల్లించేదాకా తల్లీబిడ్డలను అప్పగించేది లేదని బెదిరిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజులుగా తల్లీబిడ్డలను నిర్బంధించారని... వారిని సరిగా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఆస్పత్రి నిర్వాకంపై పోలీసులు,వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
మరోవైపు కరోనాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అడ్డగోలు దోపిడీకి తెరదీశాయి. ఒక్కో పేషెంట్ నుంచి రూ.20 లక్షలు పైనే గుంజుతున్నాయి. కుటుంబంలో ఇద్దరు,ముగ్గురు ఆస్పత్రిలో చేరితే ఉన్న ఆస్తులన్నీ అమ్మితే తప్ప చికిత్స చేయించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కార్పోరేట్ ఆస్పత్రులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సామాన్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా,ఇటు కార్పోరేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.