హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర, మోడీని నిలదీస్తాం: కెటిఆర్ ట్విస్ట్
హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్ అభివృద్ధిలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం నాడు వ్యాఖ్యానించారు. హైదరాబాదును చంద్రబాబు బాగా మార్కెట్ చేశారని కితాబిచ్చారు
ఉదయం పార్క్ హయత్ హోటల్లో ది స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ సదస్సులో కెటిఆర్ మాట్లాడారు. చంద్రబాబు వ్యూహాత్మకంగా నగరాన్ని అభివృద్ధి చేశారని, ప్రపంచంలో పెట్టుబడులకు మంచి మార్కెట్గా నిలిపారని, విలువైన పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు.
భౌగోళిక విభజనే, తెలుగుజాతిని కలుపుతాం: చంద్రబాబు, తెరాసకు చురకలు
అయితే, ఈ నగరాభివృద్ధికి తానొక్కడినే బాధ్యుడిగా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఈ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్ను ఎవరో ఒకరు నిర్మించలేదన్నారు. శతాబ్దాలుగా విస్తరిస్తూ వస్తోందని చెప్పారు.
ఇక్కడి ప్రజలకు గౌరవభావం అధికమని, పక్కవారికి సాయపడటం హైదరాబాదీల ప్రధాన లక్షణాల్లో ఒకటన్నారు. హైదరాబాద్ కాస్మో పాలిటన్ సిటీ అని చెప్పారు. దేశంలో ఉన్న నాలుగు మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్లో పరస్పరం గౌరవించుకునే సంప్రదాయం ఉందని, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నగరంలో ఎలక్ట్రానిక్ వాహనాల ఉపయోగం పెంచుతామని చెప్పారు. హైదరాబాద్ ప్రజలకు ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ ద్వారా మంచి నీరు అందుతోందని చెప్పారు.
చంద్రబాబు ప్రచారం వృథా
హైదరాబాదును విశ్వనగరంగా అభివృద్ధి చేయడం సీఎం కెసిఆర్ ఒక్కడితోనే సాధ్యమని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేయడం వృథా అని చెప్పారు. బిజెపి మతం పేరుతో ఓట్లు అడుగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనేగ్రేటర్ అభివృద్ధి జరుగుతుందన్నారు.
టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. తెలంగాణకు సహకరించకుంటే ప్రధాని మోడీని అయినా నిలదీస్తామన్నారు. కేంద్రంతో పరస్పరం సహకరించుకోవాలనే ధోరణితో తాము ఉన్నామని చెప్పారు. గ్రేటర్ సమస్యల పరిష్కారానికి వారంలో ఒకరోజు కేటాయిస్తామని చెప్పారు.
ప్రజల సహకారంతోనే గ్రేటర్ అభివృద్ధి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అవినీతి లేకుండా చేయడం తన బాధ్యత అన్నారు. తెలంగాణకు సహకరించామని కేంద్రమంత్రి వెంకయ్య మాటల్లో చెప్పడం కాదని, ఏం చేశారనేది ముఖ్యమన్నారు.