సౌదీలో హైదరాబాద్ యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి చెందిన ఓ యువతి సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. జీవనోపాధి కోసం వెళ్లిన ఆమె అకాల మృత్యువాత పడింది. పాతికేళ్ల యువతి అష్మియా ఖాటూన్ సౌదీ అరేబియాకు ఇంటి పని చేసేందుకు వెళ్లింది.
హైదరాబాద్లోని దబీర్పురాలోని షాహ్ కాలనీకి చెందిన ఆమెను అనారోగ్యం కారణం చెప్పి ఆస్పత్రిలో చేర్చారు. కింగ్ సౌద్ చెస్ట్ డిసీసెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె గురువారంనాడు చనిపోయింది. వేధింపుల వల్ల శరీరంపై తీవ్రమైన గాయాలతోనే ఆమె చనిపోయిందని వార్తలొస్తున్నాయి. అష్మియా మరణవార్త గురించి ఆసుపత్రి వర్గాలు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపాయి.
ఆమె మృతదేహాన్ని హైదరాబాద్కు పంపించాల్సిందిగా సౌదీకి తెలంగాణ ప్రబుత్వ ప్రధాన కార్యదర్సి ప్రత్యేక లేఖ రాశారు. నిరుడు 2015లో ఆమె నగరం వీడి సౌదీ వెళ్లింది. గత రెండేళ్లుగా సౌదీకి ఇంటిపని నిమిత్తం జారీ చేసే వీసాలను నిషేధించినా ఆమెను బిజినెస్ వీసాపై అక్రమంగా సౌదీ పంపించారని విచారణలో తేలింది.
అక్కడికి వెళ్లిన రెండు నెలలవరకూ ఆమె నుంచి ఎటువంటి ఫోన్ రాలేదనీ, ఆ తర్వాత ఒకరోజు ఫోన్ చేసి యజమాని తీవ్రంగా హింసిస్తున్నారనీ, చేతిపై వాతలు పెడుతున్నారని ఆవేదన చెందిందని తల్లి చెప్పింది. సౌదీలోని యజమాని అబ్దుల్ రెహ్మాన్ అలీ మహమ్మద్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఆమె మరణవార్త గురించి సౌదీ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది.