ఆశ్రిన్ కోసం నాగరాజు మతం కూడా మారాలనుకున్నాడు, ఐనా..: పరువు హత్య కేసులో కీలక విషయాలు
హైదరాబాద్: సరూర్నగర్ పరువు హత్యకేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెల్లెలు ఆశ్రిన్ సుల్తానా తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో రగలిపోయిన సోదరుడు మోబిన్ అహ్మద్.. ప్లాన్ ప్రకారమే ఆమె భర్త నాగరాజును హత్య చేశాడని పోలీసులు తేల్చారు. మే 6న హంతకులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మహ్మద్ మసూద్ అహ్మద్ను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు పోలీసులు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితులు హత్యకు వేసిన ప్రణాళికకు సంబంధించిన వివరాలు పొందిపర్చినట్లు సమాచారం.
పాఠశాల నుంచే ప్రేమ.. వివాహ బంధంతో ఒక్కటైన ఆశ్రిన్, నాగరాజు
వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన నాగరాజు(25), ఆశ్రిన్ సుల్తానా(25) పాఠశాలలో చదువుతున్న సమయం నుంచి ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 1న పాతబస్తీలోని ఆర్యసమాజ్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మే 4న రాత్రి 7 గంటల సమయంలో సరూర్ నగర్ వద్ద బైక్ పై వెళుతుండగా నాగరాజు దంపతులను అడ్డగించిన మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్లు ఇనుపరాడ్లతో కొట్టి దారుణంగా చంపారు.
పెళ్లై ఇద్దరు పిల్లులున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలన్న మోబిన్.. ఆశ్రిన్ నిరాకరించి
కాగా, హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మోబిన్ అహ్మద్ ఇంటికి పెద్దకుమారుడు. తండ్రి కిడ్నీ వ్యాధికి గురవడంతో డయాలసిస్ చేయించేందుకు అనువుగా ఉంటుందని ఐడీపీఎల్ కాలనీ గురుమూర్తినగర్ కు మారారు. రెండేళ్ల క్రితం తండ్రి మరణించాడు. దీంతో కుటుంబ భారం మోబిన్ అహ్మద్పై పడింది. పండ్లు విక్రయిస్తూ తల్లి, ముగ్గురు చెల్లెళ్లు, తమ్ముడ్ని పోషించేవాడు. గత ఏడాది రెండో సోదరిని లింగంపల్లికి చెందిన మసూద్ అహ్మద్కిచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత మూడో సోదరి ఆశ్రిన్కు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించాడు. ఈ ఏడాది జనవరిలో భార్య మరణించి ఇద్దరు పిల్లలున్న వ్యక్తితో ఆమెకు పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు సోదరి అంగీకరించకుండా ఎదురు తిరగడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఇంట్లో గొడవలు పెరిగాయి. ఇక్కడే ఉంటే బలవంతంగా తనకు పెళ్లి చేస్తారనే భయంతో ఆశ్రిన్ సుల్తానా జనవరి 30న ఇల్లు వదిలి నాగరాజు వద్దకు వెళ్లింది.
ఆశ్రిన్ కోసం మతం మారేందుకు సిద్ధమైన నాగరాజు.. అయినా..
ఫిబ్రవరి 1న నాగరాజు, ఆశ్రిన్ పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు ఎవరికి కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా, బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఇరు కుటుంబాలను పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. ఆ తర్వాత నాగరాజు, ఆశ్రిన్ వికారాబాద్ జిల్లా ఎస్పీని ఆశ్రయించి రక్షణ కల్పించమని కోరారు. దీంతో రెండు సార్లు నాగరాజు మోబిన్ అహ్మద్ తో మాట్లాడాడు. ఆశ్రిన్ కోసం తాను మతం కూడా మారేందుకు సిద్ధమని నాగరాజు చెప్పాడు. అయినా కూడా వదలకుండా నాగరాజును హత్య చేశాడు మోబిన్.
మాల్వేర్తో నాగరాజును వెంబడించి దారుణ హత్య
కాగా, పెళ్లి తర్వాత ఆశ్రిన్ సుల్తానా లింగంపల్లిలో ఉన్న అక్క పిన్నితో ఫోన్లో మాట్లాడేది. ఆశ్రిన్ అక్క భర్త మసూద్ అహ్మద్ ద్వారా మోబిన్ అహ్మద్ కు నాగరాజు దంపతుల ఆచూకీ తెలిసింది. నాగరాజు ఫోన్ నెంబర్లను సేకరించిన మోబిన్.. స్నేహితుల సహకారంతో నాగరాజు ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేయించాడు. లోకేట్ యాప్ ద్వారా ఏ సమయంలో ఎక్కడున్నారనే సమాచారం సేకరిస్తూ వచ్చాడు. మార్చి నెలలోనే హత్యకు కుట్ర పన్నినా.. రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో వాయిదా వేసుకున్నాడు. రంజాన్ మరుసటి రోజైన బుధవారం ఇంటి నుంచి బయటికి వచ్చిన నాగరాజును దారుణంగా అందరూ చూస్తుంగానే హత్య చేశారు మోబిన్, మసూద్. హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారిన ఈ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.