ఈ నగరానికేమైంది..? : టీనేజర్ల తాగుడులో 4వ స్థానంలో హైదరాబాద్
హైదరాబాద్ : దేశంలో మద్యంపై నియంత్రణ ఎంతలా కొరవడిందంటే.. ఓ 8వ తరగతి విద్యార్థి వాటర్ బాటిల్ లో మధ్యాన్ని కలుపుకుని స్కూల్ లోనే మధ్యాన్ని సేవించేంతగా..! నగరీకరణ ఎంత వేగంగా పెరుగుతుందో, అంతే వేగంగా ఎక్కువ సంఖ్యలో టీనేజర్లు మద్యానికి బానిసలవుతున్నారు. డీ అడిక్షన్ సెంటర్ నిర్వాహకుల పరిశీలనలో తేలిన నివ్వెరపోయే విషయాలివి.
టీనేజ్ లోనే మద్యానికి బానిసలవుతున్నవారిలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ నగరానిది 4వ స్థానం. టీనేజ్ కూడా రాకముందే, అంటే.. 12 ఏళ్ల వయసు నుంచే చాలా మంది పిల్లలు తాగుడుకు అలవాటు పడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కాగా, గడిచిన దశాబ్దంతో పోల్చితే నగరంలో ఆల్కాహాల్ వినియోగం 41 శాతం పెరిగినట్టుగా డీ అబ్జర్వేషన్ పరిశీలకులు తేల్చారు. విచ్చలవిడిగా వెలిసిన మధ్యం దుకాణాలు, వీటికి తోడు ప్రతీ గల్లీ చివరన వెలిసిన బెల్టు షాపులు కూడా అక్రమ మద్యం విక్రయాలకు పాల్పడుతుండడంతో నగరంలో తాగుడుకు బానిసగా మారుతున్న టీనేజర్లు, పిల్లలంతా బెల్టు షాపుల వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, మద్యానికి బానిసలుగా మారి దేశవ్యాప్తంగా ఏటా 5000 మంది టీనేజర్ల వరకు మరణిస్తున్నట్టుగా అసోచాం సర్వేలో వెల్లడైంది. ఇకపోతే హైస్కూల్ కు వచ్చే 70 శాతం మంది విద్యార్థులు బ్యావరేజ్ డ్రింక్ లను సేవిస్తున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. మద్యానికి అలవాటు పడుతున్న చాలామంది టీనేజర్లు, పిల్లలు, బీర్ ఎలాంటి ఉంటుందోనన్న ఉత్సుకతతోనే దాన్ని సేవిస్తున్నట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక మరో కారణమేంటంటే.. బాలురకు పాకెట్ మనీ ఎక్కువగా ఇవ్వడం, పార్టీల్లో స్నేహితుల బలవంతం మూలాన మద్యానికి అలవాటు పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టుగా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.