బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి: కాషాయ కండువా కప్పిన జేపీ నడ్డా, నినాదాల హోరు
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీలో చేరారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ వేదికగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాషాయ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.
సభా వేదికగా.. బీజేపీలోని మహామహులు, ప్రముఖ నేతల సమక్షంలో.. లక్షల కార్యకర్తల హర్షధ్వానాల మధ్య కొండా విశ్వేశ్వరరెడ్డికి ఘనస్వాగతం లభించింది. జూన్ 29న బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొండా విశ్వేశ్వర్రెడ్డితో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 30న బీజేపీలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే.. జులై 1 నుంచి ఇవాళ, రేపు అనుకుంటూ వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఆదివారం బీజేపీ విజయసంకల్ప వేదికగా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
కాగా, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడైన కొండా విశ్వేశ్వరరెడ్డి.. టీఆర్ఎస్ తరపున 16వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు సభ్యునిగా పనిచేస్తున్నప్పుడు యూఎస్ పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేగాక, 2014, 2018 తెలంగాణ ఎన్నికల టైంలో.. అఫిడవిట్ ఆధారంగా రిచ్చెస్ట్ పొలిటీషియన్గా నిలిచారు కూడా. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరారు. ఇప్పుడు బీజేపీలో చేరారు.
అయితే, ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యమని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అందుకే తాను బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యమకారులను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందనుకుంటే.. అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 75 శాతం ప్రజలు సీఎం కేసీఆర్పై వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందన్నారు. తాను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చారన్నారు. సకాలంలో రేవంత్ కు పీసీసీ పదవి ఇచ్చుంటే తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేవాడినని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.