హైదరాబాద్ మెట్రో నాణ్యతపై అనుమానాలు? వరుస ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు
Recommended Video
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోకి రైల్ కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఏకంగా నలుగురు ముఖ్యమంత్రుల భాగస్వామ్యాన్ని చూసింది హైదరాబాద్ మెట్రో. మరో ప్రత్యేకత కూడా నగర మెట్రో రైల్ కి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన మెట్రో రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభమైన హైదరాబద్ మెట్రో రైల్ కి ప్రజాధారణ బాగా పెరిగింది. ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం నుండి దూరంగా ప్రయాణం చేయడమే కాకుండా వేగవంతమైన ప్రయాణం కోసం చాలా మంది నగర వాసులు మెట్రో ప్రయాణాన్నిఅలవాటు చేసుకున్నారు. అంతే కాకుండా మెట్రో స్టేషన్లు చాలా విశాలంగా ఉండడంతో వర్షం పడుతున్న సమయంలో చాలామంది ద్విచక్ర వాహన దారులు, పాదచారులు మెట్రో స్టేషన్ల క్రింద తడవకుడా ఉండిపోవడం, వర్షం తగ్గిపోగానే వెళ్లి పోవడం నిత్యకృత్యంగా మారింది.
పెచ్చులూడి పడిన మెట్రో ష్టేషన్..! సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి..!!
ఐతే అత్యంత రద్దీగా ఉండే అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద ఊహించని విషాదం చోటు చేసుకుంది. అంతే కాకుండా మెట్రో నాణ్యతా లోపాలను ఒక్కసారిగా ప్రపంచానికి చాటి చెప్పింది. సుమారు వంద సంవత్సరాలు మన్నికగా ఉండే విధంగా నిర్మించామని చెప్పుకున్న ఎల్ ఆండ్ టీ నిర్మాణ సంస్థ పచ్చి అవాస్తవాలు చెప్పినట్టు రుజువైంది. హైదరాబాద్ లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి తడవకుండా మెట్రో స్టేషన్ కింద నిలబడ్డ ఓ యువతి మీద మెట్రో స్టేషన్ పెచ్చులూడి పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆశ్యర్యానికి గురిచేసింది. మెట్రో నిర్మాణం ఇంత నాసి రకండా జరిగిందా అంటూ నగర వాసులు భయ భ్రాంతులకు గురౌతున్నారు.
మెట్రో నాణ్యతా ప్రమాణాలపై అనేక సందేహాలు..! నాసిరకం నిర్మాణమంటున్న ప్రజలు..!!
నగరంలోని అమీర్పేట, మైత్రివనం మెట్రో స్టేషన్ కింద ఆదివారం సాయంత్రం దారుణమైన ప్రమాదం చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడిపడి ఓ యువతి మృతి చెందింది. మృతురాలు కేపీహెచ్బీ కి చెందిన ఇరవై నాలుగేళ్ల మౌనిక గా గుర్తించారు. టీసీఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్న మౌనిక రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్నట్లు తెలిసింది. భారీ వర్షం కురుస్తుండటంతో మౌనిక మెట్రో స్టేషన్ మెట్ల కింద నిలబడి ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి ఆ పెచ్చు నేరుగా తలమీద పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందింది. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
ఎల్ అండ్ టీ సంస్థదే తప్పు..! నాణ్యతా ప్రమాణాలు పాటించలేదంటున్న ప్రయాణీకులు..!!
మరోవైపు ఈ సంఘటనపై మెట్రో యాజమాన్యం వివరణ ఇచ్చింది. యువతి తలపై పైనుంచి పదునైన పెచ్చులు ఊడి పడడంతో ఆమె తలకు బలమైన గాయమైందని, వెంటనే సమీప ఆస్పత్రికి తరలించామని తెలిపింది. కానీ అప్పటికే మౌనిక మృతి చెందిందని తెలిపారు. ఈ దుర్ఘటనతో పాటు నాంపల్లి గాంధీ భవన్ వద్ద మెట్రో రైలు లోకో పైలట్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణీకులు ఎగిరి పడ్డారు. వెంట వెంటనే 2 సార్లు సడన్ బ్రేక్ వేయడంతో ఏం జరిగిందోనంటూ ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి ఇదే చివరి స్టేషన్ అంటూ తప్పుడు అనౌన్స్మెంట్ చేశారు. మెట్రో రైల్ సిబ్బంది చేస్తున్న తప్పులకు ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
శోక సంద్రంలో మౌనిక కుటుంబం..! మెట్రో నిర్మాణం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..!!
ఇదిలా ఉండగా మొన్న వారం రోజుల క్రితం మెట్రోలో ఓ ఆకతాయి పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటన కూడా ప్రయాణీకులను ఇబ్బందులకు గుకి చేసింది. ఢిల్లి మెట్రోలో డ్రంక్ టెస్టులు నిర్వహించిన తర్వాతనే మెట్రోలోకి అనుమతిస్తారు. అలాంటి నిబంధన హైదరాబాద్ లో కూడా అమలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇక రసూల్ పురాలో స్టేషన్ లో కూడా మెట్రో రైల్ సోమవారం ఉదయం అకస్మాత్తుగా మొరాయించినట్టు తెలుస్తోంది. కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు అనేక అవస్ధలు పడ్డట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే మెట్రోకి ఆదరణ పెరుగుతున్న తరుణంలో మెట్రో సిబ్బంది చేస్తున్న పొరపాట్ల వల్ల ప్రయాణీకులు అనేక సమస్యలను ఎదర్కొంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మెట్రో స్టేషన్ పెచ్చులూడడం, దానికి ఓ మహిళ బలవ్వడం, మెట్రో నిర్మాణంలోని డొల్లతనాన్ని చాటుతోంది.