మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కుమారుడు ఆత్మహత్య: ఆ ఆరోపణలతో మనస్తాపం చెందాడా?
హైదరాబాద్: నగరంలోని కొండాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడలు, యువజన సేవలు, పర్యాటక, సంస్కృతి, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ దేవేంద్ర కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అక్షయ్ కుమార్ తన తల్లిదండ్రులతో కలిసి కొండాపూర్ సెంటర్ పార్క్ కాలనీలోని శ్రీవెంకటసాయి నిలయంలో నివాసం ఉంటున్నాడు. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అక్షయ్ కుమార్.. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, అక్షయ్ కుమార్ పై ఇటీవల పలు ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర పీఏగా దేవేంద్ర విధులు నిర్వహిస్తుండటంతో.. ఆయన కుమారుడు దాన్ని ఆసరాగా చేసుకుని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసం చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన అక్షయ్ కుమార్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఆత్మహత్యకు కారణాలు తెలియకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.