నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసు: హైకోర్టు న్యాయవాది ఇంట్లో ఎన్ఐఏ సోదాలు, అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం సోదాలు జరుపుతోంది. నర్సింగ్ విద్యార్థిని రాధ అదృశ్యం కేసులో విచారణ జరుపుతోన్నారు ఎన్ఐఏ అధికారులు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఉప్పల్తో పాటు మెదక్ జిల్లా చేగుంటలో గురువారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు.
ఉప్పల్లోని హైకోర్టు న్యాయవాది శిల్ప ఉంట్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో శిల్పను అదుపులోకి తీసుకున్న అధికారులు.. మాదాపూర్లోని కార్యాలయానికి తరలించారు. రాధ మిస్సింగ్ కేసుకు సంబంధించి శిల్పను విచారిస్తున్నారు. మరోవైపు, చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడు శంకర్ నివాసంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది.
కాగా, తమ కూతురు కిడ్నాప్నకు గురైందంటూ.. 2017 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని పెద్దబాయిల పోలీస్ స్టేషన్లో రాధ తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్టు అనుబంధ సంస్థ సీఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేసి, రాధను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆమె ఆరోపించింది. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ ఇంటికి వచ్చేవారని ఆమె తెలిపింది.
వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లారని రాధ తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. రాధ అదృశ్యంపై విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదవడంతోపాటు రాధను నక్సల్స్లో చేర్చారని అడ్వకేట్ శిల్పపై ఆరోపణలున్నాయి. దీంతో నర్సింగ్ విద్యార్థిని రాధ కేసు ఎన్ఐఏకి అప్పగించారు. విశాఖలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు, విచారణ జరుపుతున్నారు.
న్యాయవాది సహా ముగ్గురి అరెస్ట్
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలతో చైతన్య మహిళా సంఘం(సీఎంఎస్) నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్పను ఎన్ఐఏ అధికారులు గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు.