రేపు పూజారి భుజస్కందాలపై దళితుడి ఆలయ ప్రవేశం, నాడే దళితుల కోసం రామానుజాచార్య పోరాటం
హైదరాబాద్: తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్, చిలుకూరు బాలాజి ఆలయం అర్చకులు సిఎస్ రంగరాజన్ నేతృత్వంలో ఈ నెల 16వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు మునివాహన సేవ మహోత్సవ వేడుక పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవైష్ణవ ఆలయ ప్రధాన అర్చకులు దళిత భక్తుడిని ఏకంగా తన భుజస్కంధాలపై కూర్చోబెట్టుకొని ఆలయ ప్రవేశం చేయిస్తారు.
అక్కడ శ్రీరంగనాథుడి దివ్య దర్శనం కల్పించే కార్యక్రమం చేపడతారు. హైదరాబాదు జియాగూడలోని చారిత్రక శ్రీ రంగనాథస్వామి ఆలయం ఈ అరుదైన సంఘటనకు వేదిక కానుంది.
ఆదిత్య పరశ్రీ అనే మహబూబ్నగర్కు చెందిన దేవీ ఉపాసకులు, దళిత భక్తుడికి శ్రీ వైష్ణవ ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ ప్రవేశం చేయిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
క్రీ.పూ. 2700 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగంలో ఆచరించిన ఇదే తరహా సంప్రదాయాన్ని జియాగూడలోని రంగనాథస్వామి ఆలయంలో ఆచరించనున్నట్లు తెలిపారు.
దళితజాతి అభ్యున్నతికి శ్రీరామానుజాచార్యులు వేయి సంవత్సరాల క్రితమే పోరాడారని, హిందువులు అందరూ ఒక్కటేనని ప్రపంచానికి చాటారని తెలిపారు. సమాజంలో దళితులపై వివక్షను రూపుమాపి సమసమాజ స్థాపనే ధ్యేయంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.