నిత్య పెళ్లికొడుకు: కట్నం తీసుకుని కనిపించకుండా పోతాడు
వివాహమైనా.. పెళ్లి కాలేదని చెప్పుకుంటూ పలువురు యువతులను పెళ్లి చేసుకుని కట్నంతో ఉడాయించడో పోలీసు కానిస్టేబుల్.
హైదరాబాద్: అతను బాధ్యత గల పోలీసు విభాగంలో పని చేస్తున్నాడు. కానీ, అతని బుద్ధి మాత్రం దొంగలకన్నా దారుణంగా ఉంది. తనకు వివాహమై 8ఏళ్లైనా.. పెళ్లి కాదని చెప్పుకుంటూ పలువురు యువతులను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన వెంటనే వారిచ్చిన కట్నం తీసుకుని ఉడాయించేవాడు. అతని పాపం పండి చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది.
మంచాల సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన హరిచరణ్తేజ(30) వరంగల్లోని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ 4వ బెటాలియన్లో కానిస్టేబుల్గా (2009 బ్యాచ్) పని చేస్తున్నాడు. హరిచరణ్తేజకు 8 ఏళ్ళ క్రితమే వివాహం జరిగింది. అయినా తెలుగు మాట్రిమోనిలో అవివాహిత యువతుల సమాచారం తీసుకుని వారితో పరిచయం పెంచుకునేవాడు.
వివాహం చేసుకుంటాననని నమ్మించి కట్నం తీసుకొని కనిపించకుండా పోవడం అతనికి అలవాటుగా మారింది. ఇలాగే ఇద్దరిని మోసం చేసి వారి నుంచి రూ. లక్షల్లో కట్నం తీసుకొని ఉడాయించాడు. అదే క్రమంలో మంచాల మండలం జాపాల గ్రామానికి చెందిన యువతి (26)తో వివాహ వెబ్సైట్ ద్వారా పరిచయం చేసుకున్నాడు.
3 నెలల క్రితం జాపాలకు వచ్చి రూ.2.50 లక్షల కట్నం మాట్లాడుకొని అడ్వాన్సుగా రూ.లక్ష తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలి అన్న హరిచరణ్తేజ వివరాలు సేకరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతని గత వివాహాల గురించి తెలియడంతో మంచాల పోలీసులను ఆశ్రయించాడు.
ఈ క్రమంలో పోలీసుల సూచన మేరకు మిగతా కట్నం డబ్బులు ఇస్తానని రెండు రోజుల క్రితం హరిచరణ్ తేజ్కు బాధితురాలి అన్న ఫోన్ చేశాడు. దీంతో బుధవారం సాయంత్రం హరిచరణ్తేజ్ అతని ఇంటికి వచ్చాడు. వెంటనే బాధితులు ఈ విషయాన్ని మంచాల సీఐ గంగాధర్కు తెలుపడంతో ఆయన జాపాలకు చేరుకొని హరిచరణ్తేజను అరెస్టు చేశారు.