హైద్రాబాద్లో నేనూ సెటిలర్నే: కెటిఆర్ కొత్త రాగం, కెసిఆర్ను కలిసిన పవార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హైదరాబాదులో సెటిలర్నే అని వ్యాఖ్యానించారు.
హైదరాబాదులోని సీమాంధ్ర ఓటర్ల కోసం తెరాస గాలం వేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంత్రులు, తెరాస నేతలు హైదరాబాదులోని సీమాంధ్రులు తమకు ఓటు వేసేలా ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు.
ఇందులో భాగంగా కెటిఆర్ మంగళవారం మాట్లాడుతూ... హైదరాబాదులో సెటిలర్ కానివారు ఎవరని ప్రశ్నించారు. తాను కూడా సిద్దిపేట నుంచి వచ్చి భాగ్యనగరంలో సెటిల్ అయిన సెటిలర్నే అని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఓడితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న సవాల్కు కట్టుబడి ఉన్నానని, విపక్షాల విషయంలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.
ఐటీ రంగంలో రిజర్వేషన్ల విషయమై మాట్లాడుతూ... ఏ నగరంలో కూడా ఐటీ రంగంలో రిజర్వేషన్ సాధ్యం కాదన్నారు. ప్రైవేట్ రంగంలో నైపుణ్యం గల వ్యక్తులను మాత్రమే మాత్రమే తీసుకుంటారని, పెద్దపెద్ద సంస్థలన్నీ హైదరాబాద్లో క్యాంపస్లను ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు.
కెసిఆర్ను కలిసిన శరద్ పవార్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఎన్సీపీ నేత శరద్ పవార్ మంగళవారం నాడు కలిశారు. కాగా, పవార్ రాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశాలున్నాయని, మద్దతు కోసమే ఆయన కెసిఆర్ను కలిసేందుకు వచ్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.