రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదు కానీ, మేం మూడో వేదిక: కోదండ
హైదరాబాద్: తనకు ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శనివారం నాడు చెప్పారు. రాష్ట్రంలో మూడో వేదికగా ఉండాలనే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం మొదటి వేదిక కాగా, ప్రతిపక్షం రెండో వేదిక అన్నారు. తాము మూడో వేదికగా మాత్రమే ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే విధంగా తమ వేదిక కృషి చేస్తుందని చెప్పారు.
ఈ క్రమంలో అన్ని సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కరువు నివారణ చట్టం తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. చట్టం తీసుకు వస్తే ఒక క్రమ పద్ధతిన కరువు లెక్కల సేకరణ, రైతులకు సాయం, ఇతర కార్యక్రమాలు సజావుగా సాగే అవకాశముందన్నారు.
బీసీలకు సంపన్నశ్రేణి
ఉద్యోగ నియామకాల్లో బీసీలకుక్రీమీలేయర్ నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంబంధిత దస్త్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని బీసీ సంక్షేమ శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు, అన్ని జిల్లాల కలెక్టర్లకు అందించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉద్యోగాల భర్తీ సందర్భంగా దీనిని అమలు చేయనున్నారు. దీని ప్రకారం రూ.6 లక్షల వరకు వార్షిక ఆదాయ పరిమితి గల వారు మాత్రమే ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు పొందుతారు. ఈ పరిమితి దాటిన వారికి రిజర్వేషన్లు వర్తించవు.