దళిత బంధు అమలవకపోతే-యాదగిరి గుట్టలో ఆత్మార్పణ చేసుకుంటా-మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు
తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి కేసీఆర్లా దళితుల అభివృద్ది కోసం పనిచేసిన మరో నాయకుడిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితుల గురించి ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దళిత బంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో ఇప్పటికీ పెద్దగా మార్పేమీ లేదని... రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లోనే ఇంకా దళితులు ఉన్నారని అన్నారు.
తెలంగాణలో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ వందశాతం కచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో దళిత బంధు అమలవకపోతే యాదగిరిగుట్ట వద్ద ఆత్మార్పణ చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.దళిత బంధుపై ప్రతిపక్షాల కుట్రలను వ్యతిరేకిస్తూ ఆదివారం(ఆగస్టు 29) మోత్కుపల్లి తన నివాసంలో ఒకరోజు దీక్షకు దిగారు.
దళిత బంధు మహోన్నత పథకం : మోత్కుపల్లి నర్సింహులు
ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురై దళితులు ఎంతో మానసిక క్షోభ అనుభివించారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. గ్రామాల్లో తల రుమాలు, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేస్తోందన్నారు. దళిత బంధు మహోన్నతమైన నిర్ణయమని.. ఇప్పటివరకూ దేశంలో దళితుల కోసం నామమాత్రపు పథకాలు పెట్టారే తప్ప ఇంత పెద్ద పథకం ఎవరూ తీసుకురాలేదన్నారు.
దళిత జాతికి మోక్షం కల్గించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.వ్యవస్థలో హెచ్చు తగ్గులు పోవాలంటే ఆర్ధిక స్వావలంభన కావాల్సిన అవసరం ఉందన్నారు.
రేవంత్ రెడ్డి జీవితమంతా బ్లాక్ మెయిలింగే : మోత్కుపల్లి నర్సింహులు
'కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది సీఎంలుగా చేశారు. కానీ ఎవరూ దళితుల సంక్షేమం కోసం పాటుపడలేదు. మమ్మల్ని ఇప్పటికి బానిసలుగానే చూస్తున్నారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడని మోత్కుపల్లి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటున్నారు. మంచి పని చేస్తే ఎవరికైనా మద్దతిస్తాం. దళిత బంధుకు కాంగ్రెస్, బీజేపీ ఎందుకు అడ్డుపడుతున్నాయి.
టీడీపీని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డి. అతని వల్లే చంద్రబాబు నాశనమయ్యారు. రేవంత్ రెడ్డిది శని పాదం. రేవంత్ రెడ్డి జీవితమంతా మోసం, బ్లాక్ మెయిలింగే. ఆర్టీఐని వాడుకున్నది రేవంత్ రెడ్డే.' అని మోత్కుపల్లి పేర్కొన్నారు..దళిత బంధు పథకం గురించి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలో తనకు నిజాయతీ కనిపించిందని, ఆయన చెప్పినట్లు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు.
బీజేపీని వీడిన మోత్కుపల్లి...
జూన్ 27న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దళిత సాధికారత పథకంపై అఖిలపక్ష సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. పార్టీలు,రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. దళిత సామాజికవర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులను,సామాజిక కార్యకర్తలను,ఆయా రంగాల్లో దళితుల కోసం కృషి చేస్తున్నవారిని సమావేశానికి ఆహ్వానించారు. దళిత నాయకుడిగా మోత్కుపల్లికి కూడా ఆహ్వానం అందింది.
అప్పటికీ ఆయన బీజేపీలో ఉన్నారు. బీజేపీ నాయకత్వం ఈ సమావేశాన్ని బహిష్కరించగా మోత్కుపల్లి దానికి హాజరవడం పార్టీలో చిచ్చు రేపింది. పార్టీ నాయకత్వానికి,ఆయనకు మధ్య గ్యాప్ పెరిగింది. దానికి తోడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి మంత్రిగా పనిచేసి సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదని మోత్కుపల్లి భావించారు. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీకి రాజీనామా ప్రకటించారు.
దళిత బంధు ఛైర్మన్గా మోత్కుపల్లి...?
మోత్కుపల్లి నర్సింహులు ఇంకా టీఆర్ఎస్లో చేరనప్పటికీ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఒకానొక దశలో కేసీఆర్ అంటేనే అంతెత్తున ధ్వజమెత్తిన ఆయన ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దళిత బంధు లాంటి మంచి పథకాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉందని... అన్నిసార్లు విమర్శలు పనికిరావని మోత్కుపల్లి అభిప్రాయపడుతున్నారు.
టీఆర్ఎస్లో మోత్కుపల్లి చేరిక ఎప్పుడనేది ఇంకా తెలియరానప్పటికీ... దళిత బంధు ఛైర్మన్గా ఆయన్ను నియమించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ ఉపఎన్నిక బరిలో సైతం మోత్కుపల్లిని దింపవచ్చనే ఊహాగానాలు వినిపించాయి.
ప్రతిష్ఠాత్మకంగా దళిత బంధు పథకం...
దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. హుజురాబాద్లో దళిత బంధు అమలుకు రూ.2వేల కోట్లు విడుదల చేస్తామని పథకం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే స్వల్ప వ్యవధిలోనే మొత్తం నిధులను విడుదల చేశారు. రానున్న రోజుల్లో బీసీ,ఎస్టీ,ఓసీల్లోని పేదలకు సైతం కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున అందిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. దళిత బంధు ప్రకటన తర్వాత ఇతర వర్గాల్లో నుంచి కూడా డిమాండ్ వెల్లువెత్తడంతో ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
హుజురాబాద్లో సంపూర్ణంగా... మిగతా 118 నియోజకవర్గాల్లో పాక్షికంగా దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలుచేయనుంది. మొదటి విడతలో నియోజకవర్గానికి 100 మందికి రూ.10లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హుజురాబాద్ నుంచి దీనికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం... అక్కడ ప్రతీ దళిత కుటుంబానికి పథకాన్ని అందిస్తామని చెబుతోంది. ఆగస్టు 16న హుజురాబాద్ నియోజకవర్గంలోని 15 దళిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెక్కులు అందజేశారు. దళిత బంధు పూర్తిగా సబ్సిడీ పథకమేనని... తిరిగి ఒక్క పైసా చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.