బండారం బయటపెట్టనా: బాబుకి తలసాని, జూపల్లి ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి మాటలన్నీ పచ్చి అబద్దాలని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పాలమూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో జిల్లాలో ప్రాజెక్టులకు రూ.10 కోట్లు ఖర్చు చేయలేదన్నారు.
పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని ఇక్కడి దారిద్రాన్ని, వలసలను మరింత పెంచారన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో విద్యుదుత్పత్తి 5వేల మెగావాట్ల కన్నా మించలేదన్నారు. దీనిపై జిల్లా టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు ఏం చెబుతారని ప్రశ్నించారు. త్వరలోనే తెలంగాణలో టీడీపీ కనుమరుగు కావడం ఖాయమన్నారు.
నన్ను కెలికతే బండారం బయటపెడతా: తలసాని

చంద్రబాబు వద్ద తెలంగాణ టీడీపీ నాయకుల బతుకు ఏమిటో తనకు తెలుసునని, తనను కెలికితే మీ అందరి బండారం బయట పెడతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఓడిపోతాననే తాను ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజీనామా చేయాలని పిచ్చిపిచ్చిమాటలు మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర రావుకు దమ్ముంటే తనతో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమా? అన్నారు. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి వంటివారెంతో మంది చంద్రబాబును బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్న విషయం వాస్తవం కాదా? అన్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జారిపోకుండా వారికి ప్యాకేజీలు ఇస్తున్నచరిత్ర కూడా చంద్రబాబుదేనని ఆరోపించారు.
అలాగే ఎవరికి ఎంత ముట్టిందన్న లెక్కలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. తెరాసలో చేరిన టీడీపీ నాయకులను అమ్ముడుపోయారని విమర్శించే మీరే అతిపెద్ద కలెక్షన్కింగ్లన్నారు. తెరాసలోచేరేందుకు ఎర్రబెల్లి మంతనాలు సాగించలేదా? అర్ధరాత్రి దొంగలా సీఎంను కలిసింది నిజం కాదా? అన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంట్లో తీగల కృష్ణారెడ్డి తదితరులతో కలిసి సమావేశం పెట్టి ఎర్రబెల్లి ఏం మాట్లాడారో చెప్పాలన్నారు.
తెరాసలో వేరే వారిని చేర్చుకుంటే అవినీతి అంటారా? కానీ మీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను మీ పార్టీలో చేర్చుకుంటే నీతా అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా తన ప్రాంత, నియోజకవర్గం అభివృద్ధికి, ప్రయోజనాలకు అనుగుణంగా ఏ పార్టీలో అయినా చేరే హక్కుఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications