మహిళలకు ఆయుధాలు ధరించే హక్కు: స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్
హైదరాబాద్: జిల్లా కలెక్టర్గా సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రశంసలందుకున్న ఐఏఎస్ అధికారి స్మతా సబర్వాల్ ప్రస్తుతం సీఎంఓ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియా వేదికగా పలు సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తారు. అయితే, తాజాగా, ఆమె మన న్యాయ వ్యవస్థపై కొంత అసహనం వ్యక్తం చేశారు.
సామూహిక అత్యాచారం కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మహిళలకు మద్దతుగా చేసిన ఆ వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ముందస్తు విచారణకు అవకాశం లేదనే కారణంతో గ్యాంగ్రేప్నకు పాల్పడిన ఓ నిందితుడి శిక్షను గత వారం మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 25 ఏళ్లకు విధించిన శిక్షను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ రోహిత్ ఆర్య, జస్టిస్ రాజీవ్ కుమార్ శ్రీవాస్తవ ధర్మాసనం నిందితుడికి రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో సదరు నిందితుడు ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యాడు.
If this trend of Judicial let-downs continue, it may be time to allow women of this country the Right to bear Arms !
— Smita Sabharwal (@SmitaSabharwal) November 8, 2022
'Justice and Law cannot be two different things'. #shameful pic.twitter.com/JUrWKq2frY
ఈ వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా, స్మితా సబర్వాల్ కూడా ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. 'న్యాయ వ్యవస్థలో నిరాశ కలిగించే ఈ తరహా తీర్పులు ఇంకా కొనసాగితే.. ఈ దేశంలోని మహిళలకు ఆయుధాలు ధరించే హక్కును అనుమతించే సమయం ఆసన్నమవుతుంది. న్యాయం, చట్టంరెండు వేర్వేరు విషయాలు కావు. ఇది సిగ్గుచేటు' అని స్మిత్ సబర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ట్వీట్కు నెటిజన్ల నుంచి మద్దతు పలుకుతున్నారు. మరికొందరు తెలంగాణలో జరిగే దారుణాలపైనా ఇదే విధంగా స్పందించాలని కోరుతున్నారు.