నేను చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తా-బండి సంజయ్ది తప్పయితే రాజీనామాకు సిద్దమా: కేటీఆర్ సవాల్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని బండి సంజయ్ ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు.ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ బండి సంజయ్... మొత్తం నిధులు కేంద్రానివేనంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి అందిన ఆదాయం రూ.2.72లక్షల కోట్లు కాగా... కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.1.42లక్షల కోట్లు మాత్రమేనని కేటీఆర్ అన్నారు.తాను చెప్పింది తప్పయితే తన పదవికి రాజీనామా చేస్తానని... బండి సంజయ్ చెప్పింది అబద్దమైతే ఆయన రాజీనామా చేస్తారా... అని కేటీఆర్ సవాల్ విసిరారు.గద్వాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది పనులకు కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేశారు.అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు.
సంజయ్ చెబుతున్నది నిజమే అయితే...
బండి సంజయ్ చెబుతున్నట్లు రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తే... ఇక్కడున్న పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఆదాయాన్ని ఉత్తర ప్రదేశ్కు తరలిస్తున్నారని ఆరోపించారు. మన రక్తం, మన చెమటతో దేశంలోని వెనుకబడ్డ ఇతర రాష్ట్రాలకు కేంద్రం నిధులు తీసుకెళ్తోందన్నారు.తెలంగాణను ప్రధాని మోదీ దగా చేస్తున్నారని ఆరోపించారు. దొడ్డు ధాన్యం కొనేది లేదని కేంద్రం చెబుతోందని... కేంద్రంపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. . ఐఐఎంలు, నవోదయ విద్యాలయాల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపిందన్నారు.
వాల్మీకి బోయలపై ప్రేమ ఉంటే ఆ పనిచేయండి...
వాల్మీకి బోయల సమస్యను గతంలో ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు. 2007లోనే కేసీఆర్ వాల్మీకి బోయల సమస్యపై స్పందించారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కమిషన్ సిఫారసు చేసిందన్నారు.దీనిపై అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించామని... ప్రస్తుతం అది కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని అన్నారు. వాల్మీకి బోయ సోదరులపై ప్రేమ ఉంటే... ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ... ప్రధాని మోదీని ఒప్పించి వారిని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలన్నారు.
రేవంత్ రెడ్డిపై విమర్శలు...
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పొరుగునే ఉన్న కర్ణాటకలో లేవని కేటీఆర్ అన్నారు.'ఇవాళ నా కాన్వాయ్కి అడ్డుపడిన బీజేపీ యువకులకు చెప్తున్నా... ఒక బస్ పెడతాను.. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితి చూసి రండి.. ఇక్కడి సంక్షేమ పథకాలు అక్కడ ఉన్నాయో చూసి రండి.. మీకే తేడా తెలుస్తుంది'. అని కేటీఆర్ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. చరిత్ర తప్ప భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు.డబ్బు సంచులతో దొరికినోడు పీసీసీ చీఫ్ అయ్యాడని విమర్శించారు.రైతులకు కరెంట్ కూడా ఇవ్వని దద్దమ్మలున్న పార్టీ కాంగ్రెస్ అని... పాలమూరును వలసల జిల్లాగా మార్చిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని అన్నారు.పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు మండుతున్నాయని... కేసీఆర్ను తిడితే పెద్ద నాయకులు కాలేరని పేర్కొన్నారు.
అభివృద్ది పనులకు శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు
రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.తప్పకుండా గద్వాలకు కూడా మెడికల్ కాలేజీ వస్తుందన్నారు.ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో 1,32,000 ఉద్యోగాలు భర్తీ చేశామని, పని చేసే ప్రభుత్వాన్ని కొంతమంది బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.అంతకుముందు,అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు.జూరాల ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మాణానికి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా గ్రంథాలయ భవనం, జూనియర్ కళాశాల కోసం భనవ నిర్మాణానికి, డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులకు, ఆడిటోరియం నిర్మాణానికి భూమిపూజ చేశారు. మార్కెట్ యార్డు ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు భూమి పూజ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.