అక్కడ పూజలు చేస్తే గెలుపు ఖాయమా.. గులాబీ బాస్ సెంటిమెంట్ వర్కవుటవుతుందా?
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల వేడి షురువయింది. అటు మహాకూటమి, బీజేపీ.. ఇటు టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలో దైవం, జ్యోతిషం, వాస్తుశాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా అనేది చర్చానీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన సెంటిమెంట్ ఏంటనుకుంటున్నారా. కోనాయిపల్లి వెంకన్న పాదాల చెంత బీ-ఫారాలు ఉంచితే టీఆర్ఎస్ విజయం ఖాయమనేది ఆయన నమ్ముతారు. ఇంకేముంది పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చేముందు ఆ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ పూజలు చేసి నామినేషన్లు దాఖలు చేస్తే గెలుపు సులువనేది కేసీఆర్ నమ్మకం. అలా పూజ చేసిన 107 బీ-ఫారాలు అభ్యర్థులకు అందించారు.
అక్కడ పూజలు చేస్తే గెలుపు ఖాయమా...!
తెలంగాణ ఉద్యమం మొదలు రాష్ట్ర సాధన వరకు తాను నమ్మి చేసిన ప్రతీ కార్యక్రమం విజయవంతమైంది. తెలంగాణ సాధించడంలో భాగంగా ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు కేసీఆర్. ఆయన ఎప్పుడూ పోటీచేసినా కూడా కోనాయిపల్లి వెంకన్న ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు. పాత సంప్రదాయమే కొనసాగిస్తూ ఈసారి కూడా 107 మంది అభ్యర్థుల బీ-ఫారాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1983 ఎన్నికల్లో తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసినప్పుడు ఈ ఆలయంలోనే పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో అప్పటినుంచి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ ఆలయానికి రావడం ఆనవాయితీగా మారింది. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే కేసీఆర్ నామినేషన్ వేస్తుంటారు. గతంలో కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ పార్లమెంట్ స్థానాలకు పోటీచేసిన సమయంలోనూ ఇదే పద్దతి కొనసాగించారు. 2009లో ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించిన వేళ... అలాగే టీఆర్ఎస్ పార్టీని ప్రకటించే క్రమంలో కరీంనగర్ బహిరంగ సభకు ముందు కూడా కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్నారు. 2014 ఎన్నికల్లోనూ గజ్వేల్ నుంచి నామినేషన్ వేసినప్పుడు ఈ ఆలయంలో పూజ చేశాకే నామినేషన్ దాఖలు చేశారు. అప్పుడు ఘన విజయం సాధించడంతో కోనాయిపల్లి వెంకన్నపై కేసీఆర్ కు మరింత గురి కుదిరింది. అందుకే ఈసారి కూడా ఇక్కడే పూజలు చేశాకే పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. కోనాయిపల్లి వెంకన్న దయతో ఈదఫా ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందనేది ఆయన నమ్మకం.
ఎక్కడ ఈ ఆలయం... దేవుళ్లపై కేసీఆర్ నమ్మకం
కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంది. సిద్దిపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంగునూరు మండల పరిధిలోకి వస్తుంది. వాస్తుశాస్త్రం, జ్యోతిషాన్ని అధికంగా విశ్వసించే గులాబీ బాస్ సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తాను మొక్కుకున్న మొక్కులు ఒక్కొక్కటిగా తీర్చుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చండీయాగం నిర్వహించడమే గాకుండా తిరుపతి వెంకన్నకు బంగారు ఆభరణాలు, విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక, వరంగల్ కురవి వీరభద్ర స్వామికి బంగారు కోరమీసాలు సమర్పించారు. అంతలా దేవుళ్లను బలంగా నమ్మి మొక్కులు తీర్చుతున్న కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ ఎలక్షన్లు వచ్చినా కోనాయిపల్లి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశాకే నామినేషన్ వేయడం ఆనవాయితీగా వస్తోంది.
నెంబర్లపై కేసీఆర్ గురి
సెంటిమెంట్ ను బలంగా నమ్మే కేసీఆర్ సంఖ్యాశాస్త్రం కూడా ఫాలో అవుతుంటారు. ఆయన లక్కీ నెంబర్ 6. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి మొన్నటి అసెంబ్లీ రద్దు దాకా 6 చుట్టే కథ తిరిగిందనేది అందరికీ తెలుసు. సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రకటించిన తొలిజాబితా కూడా 6 కలిసొచ్చేలా రూపొందించారు. 105 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించారు.
ఇంతకు కేసీఆర్ నామినేషన్ ఎప్పుడు..?
గులాబీ బాస్ కేసీఆర్ ఈనెల 15న నామినేషన్ దాఖలు చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఆయన లక్కీ నెంబర్ 6 కావడంతో ఈ తేదీ ఫిక్సయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పండితుల సూచన మేరకు దాదాపుగా ఈ తేదీ ఖరారయ్యే ఛాన్సుంది. ఈనెల 12,14,16,18 తేదీల్లో మంచి ముహుర్తాలున్నట్లు తెలుస్తోంది. దాదాపు చాలామంది ఈ రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేసే వీలుంది. అయితే ఈ నాలుగు తేదీలు కూడా కేసీఆర్ కు కలిసొచ్చే ఆరో నెంబర్ కు సరిపోకపోవడంతో నామినేషన్ దాఖలుకు 15వ తేదీకే కేసీఆర్ మొగ్గుచూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.