జనవరి నుంచే..: మరో కీలక హామీ ప్రకటించిన కేటీఆర్
కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రధాన పార్టీలన్నీ కీలక హామీలిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ మరో కీలక హామీని ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత జనవరి నెలలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే 3 గంటలే కరెంట్ వస్తుందన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే మనకు మరణమేనినంటూ హెచ్చరించారు. కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పట్లో రూ. 200 పింఛను ఇచ్చిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు 4వేలు ఇస్తామంటున్నారని.. కాంగ్రెస్ మాటలు నమ్ముతారా? అని ప్రశ్నించారు.

2014లో రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం రూ. 1200 అయ్యిందని.. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రూ. 400కే ఇస్తామన్నారు కేటీఆర్. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లను బీఆర్ఎస్ జమ చేసిందన్నారు. కేసీఆర్ పోరాటంతోనే మనకు తెలంగాణ సాకారమైందన్నారు. కేసీఆర్ దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించిందని చెప్పుకొచ్చారు.
ఈసారి కూడా నవంబర్ 29న దీక్షాదివస్ నిర్వహిస్తామన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడివారు అక్కడే దీక్షాదివస్ నిర్వహించాలన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలన్నారు.
వందలాది తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తన పాత పార్టీ బీజేపీపై ప్రేమ ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందని ఆరోపించారు. గోషామహల్లో ఈసారి బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications