అక్రమ అబార్షన్ల దందా : గుట్టు చప్పుడు కాకుండా ఓ గదిలో .. హన్మకొండలో గుట్టు రట్టు చేసిన పోలీసులు
హన్మకొండ జిల్లాలో అక్రమ అబార్షన్లు నిర్వహిస్తూ వైద్యుల అడ్డంగా దొరికిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. గత కొంత కాలంగా హన్మకొండ జిల్లా కేంద్రంలో యధేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు, అబార్షన్లు చేస్తున్న తీరు తాజాగా పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చింది. బాగా రద్దీగా ఉండే ఆస్పత్రుల ఏరియాలో సాగుతున్న ఈ అక్రమ అబార్షన్ల గుట్టు రట్టు చేశారు హన్మకొండ పోలీసులు.
లింగనిర్ధారణ పరీక్షలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా అక్రమ అబార్షన్లు
పోలీసులు వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ కాకాజీ కాలనీలో గత కొన్ని నెలల నుండి డాక్టర్ సబిత, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమ అబార్షన్లకు తెరతీశారు. హన్మకొండ కాకాజీ కాలనీ లో ఒక రూమ్ ను అద్దెకు తీసుకొని అక్రమ అబార్షన్ల దందా మొదలుపెట్టారు. అబార్షన్లు చేయించుకోవాలి అనుకునేవారికి లింగనిర్ధారణ పరీక్షలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా అద్దెకు తీసుకున్న రూమ్ లో అబార్షన్ ల దందాను కొనసాగిస్తున్నారు. ఇక ఈ రోజు అబార్షన్ చేయించుకోవడం కోసం 9 మంది మహిళలు వచ్చినట్లు పోలీసులు, వైద్య అధికారులకు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

దాడి చేసిన పోలీసులు .. స్కానింగ్ మెషీన్ తో పాటు సామాగ్రి సీజ్ .. డాక్టర్ లు అరెస్ట్
ఈ దాడిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ మిషనరీ తో పాటు, అక్కడ అబార్షన్లకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. డాక్టర్ సబితా, ప్రవీణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అబార్షన్లు చేయించుకోవడానికి వచ్చిన మహిళల వివరాలు సేకరిస్తున్న పోలీసులు వీరు ఎవరి ద్వారా ఈ డాక్టర్ల వద్దకు వచ్చారో కూపీ లాగుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి మహిళలు అబార్షన్ల కోసం వస్తారని సమాచారం. అక్రమ అబార్షన్లకు పాల్పడుతున్న డాక్టర్ సబిత హోమియోపతి వైద్యురాలు కాగా, ప్రవీణ్ నిత్యశ్రీ పాలీ క్లినిక్ ను నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక వీరి దందాపై తీగ లాగుతున్న పోలీసులు ఈ కేసులో మరెన్ని విషయాలను వెలుగులోకి తెస్తారో వేచిచూడాలి.
అక్రమ అబార్షన్ల దందా : గుట్టు చప్పుడు కాకుండా ఓ గదిలో .. హన్మకొండలో గుట్టు రట్టు చేసిన పోలీసులు #hanamkonda, #police pic.twitter.com/O1h2JQffuv
— oneindiatelugu (@oneindiatelugu) September 13, 2021
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతున్న అక్రమ అబార్షన్లు
ఇదిలా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా అక్రమ స్కానింగ్ టెస్ట్ లకు, అక్రమ అబార్షన్లకు అడ్డాగా మారింది. గల్లీకో శంకర్ దాదా ఎంబిబిఎస్ లు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటుగా, అక్రమ అబార్షన్లను ఇబ్బడిముబ్బడిగా చేస్తున్నారు . హన్మకొండలోని కాకాజీ కాలనీ, బస్ స్టాండ్ సెంటర్, విజయ టాకీస్ రోడ్డు, రాంనగర్, భీమారం, రామారం, కే యు సి రోడ్డు, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, రంగశాయిపేట వంటి పలు ఏరియాలలో పలు స్కానింగ్ సెంటర్లు, హాస్పిటల్స్ లో అక్రమ అబార్షన్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.
అక్రమ అబార్షన్ల దందా : గుట్టు చప్పుడు కాకుండా ఓ గదిలో .. హన్మకొండలో గుట్టు రట్టు చేసిన పోలీసులు #hanamkonda, #police pic.twitter.com/FuzcAGRCsV
— oneindiatelugu (@oneindiatelugu) September 13, 2021
అక్రమ అబార్షన్ల దందాకు చెక్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు
ఒక వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో రేడియాలజీ, గైనిక్, స్కానింగ్ సెంటర్లు సెంటర్లు 180 వరకు ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన అక్రమ అబార్షన్ల దందా, ఇంకా జిల్లాలో అనేక చోట్ల జరుగుతున్నట్లుగా సమాచారం . ఈ క్రమంలో వైద్య శాఖ అధికారులు, పోలీసులు ఈ దందా కు చెక్ పెట్టడానికి ప్రత్యేకమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లా, మహబూబాద్ జిల్లా కేంద్రంగా అక్రమ అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలు జోరుగా సాగుతున్నట్టు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అనేక ఘటనల ద్వారా తెలుస్తుంది.












Click it and Unblock the Notifications