అక్రమంగా అంబులెన్స్లో తరలిస్తుండగా పేలిన సిలిండర్.. 13 ఆవులు సజీవదహనం: రాజా సింగ్ ఆగ్రహం
నిజామాబాద్: రాష్ట్రంలో ఆవుల అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా చోటు చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఓ అంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న ఆవులు సజీవదహనమయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, అధికారులకు చిక్కకుండా ఉండేందుకే దుండగులు ఆవులను.. మనుషులను తరలించే అంబులెన్స్ లో అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది.
అయితే ప్రమాదవశాత్తు అంబులెన్స్కు మంటలు అంటుకోవడంతో.. ఆవులన్నీ సజీవదహనమయ్యాయి. ఈ ఘటన జిల్లాలో కలకలంగా మారింది. శనివారం రాత్రి అంబులెన్స్ స్టిక్కర్ ఉన్న వాహనంలో ఆవులను అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు కొందరు దుండగులు.
నిర్మల్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా.. ఇందల్వాయి వద్దకు రాగానే వాహనంలో సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కనే ఆపేసి పరారయ్యాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు.
అనంతరం డోర్లు ఓపెన్ చేసి చూడగా.. అందులో సుమారు 13 ఆవులు సజీవదహనమయ్యాయి. సమాచారం అందుకున్న అనంతరం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు నిజామాబాద్ ఏసీపీ. ఆవులను అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
అంబులెన్స్ను, చనిపోయిన ఆవులను ఖాళీ ప్రదేశానికి తరలించారు పోలీసులు. వెటర్నరీ వైద్యులు ఆవులకు పోస్ట్మార్టం నిర్వహించారు. ఆవుల అక్రమ రవాణాకు పాల్పడింది ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంబులెన్స్ రిజిస్ట్రేషన్, టోల్ ప్లాజా దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఆవుల అక్రమ రవాణాపై రాజా సింగ్ ఆగ్రహం
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ గేట్ వద్ద అక్రమంగా అంబులెన్స్లో తరలిస్తుండగా ఆవులు సజీవ దహనం అయిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఈఘటనపై సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.