ప్రతిపక్షాలకు షాకిచ్చిన కేంద్రం: కరోనా కట్టడి చర్యలు భేషంటూ తెలంగాణపై ప్రశంసలు
హైదరాబాద్: కరోనావైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యల పట్ల కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వ బృందం తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా కట్టడి చర్యలపై ప్రశంసలు కురిపించింది.

తెలంగాణ సర్కారుపై ప్రశంసలు
గురువారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కరోనా కట్టడి కోసం మెరుగైన చర్యలు చేపడుతోందని, వైద్య సౌకర్యాలు కూడా బాగున్నాయని ప్రశంసించారు. హైదరాబాద్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం తగినన్ని టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు, పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామాగ్రి అందుబాటులో ఉన్నట్లు గుర్తించిందని పుణ్యసలీల వెల్లడించారు. ఎండ్-టు-ఎడ్ ఐటీ డ్యాష్ బోర్డు ద్వారా కరోనా పరీక్షలు చేసినప్పటి నుంచి డిశ్చార్జ్ వరకు పేషెంట్లను ట్రాక్ చేసే సాంకేతిక వాడుతున్నారని శ్రీవాస్తవ తెలిపారు.

లాక్డౌన్.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది..
హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారని, ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారని శ్రీవాస్తవ తెలిపారు. వలస కార్మికుల తరలింపుపై కేంద్రం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుందా? అని ప్రశ్నించగా.. ఇప్పటి వరకైతే బస్సుల్లో వెళ్ళేందుకు మాత్రమే అనుమతి ఉందని చెప్పారు.
ప్రతిపక్షాలకు షాకే..
హైదరాబాద్ నగరంలో కోవిడ్ ఆస్పత్రులు, షెల్టర్ హోమ్స్, అక్షయపాత్ర ఫౌండేషన్ వారి మెగా కిచెన్ లను రెండ్రోజుల క్రితం కేంద్ర దృందం సందర్శించింది. గాంధీ, కింగ్ కోఠి ఆస్పత్రులకు వెళ్లి కూడా పరిశీలించిన విషయం తెలిసిందే. నగరంలోని హుమాయున్ నగర్ కంటైన్మెంట్ జోన్ ను కూడా ఈ బృందం పరిశీలించింది. కాగా, తెలంగాణలో తగిన సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడం లేదని విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications