రంజాన్ వేళ మసీదుల్లో కరోనా ‘అజాన్’.. వైరస్ వ్యాప్తిపై వెరైటీ ప్రకటనలు..
హలీం లేని రంజాన్.. ఊహించడానికి కూడా అదోలా అనిపించే ఆ మాయదారి రోజులు ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చాయి. అప్పుడెప్పుడో రెండో ప్రపంచ యుద్ధంకాలంలో.. అది కూడా అతి కొన్ని దేశాల్లో మాత్రమే రంజాన్ మాసాన్ని వేడుకలా జరుపుకోవద్దని నిషేధించారు. మళ్లీ ఇన్నేళ్లకు కరోనా మహమ్మారి వల్ల సామూహిక వేడుకలకు దూరం కావాల్సి వచ్చింది. ఇండియాతో కలిపి ఏకంగా 185 దేశాల్లో ఈసారి రంజాన్ పూర్తిగా ఇంటి పండుగలా మారిపోయింది.
వినూత్న ప్రయోగం..
లాక్డౌన్ కారణంగా కన్నులపడువగా జరగాల్సిన లోకాభిరాముడి కల్యాణం సాదాసీదాగా ముగిసింది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలనాడూ జనం చర్చిలకు వెళ్లలేకపోయారు. నిషేధాజ్ఞలు సడలించకముందే పవిత్ర రంజాన్ మాసం వచ్చేసింది. సామూహిక ప్రార్థనలు, సాయంత్రం ఇఫ్తార్ విందులు, పేదలకు సహాయాలు.. ఇలా ఘనంగా గడవాల్సిన రోజులు కాస్తా రివర్స్ అయ్యాయి. కరోనా కారణంగా కాలు బయట పెట్టలేని పరిస్థితి. అయినాసరే మేం వినం, ముందుకే వెళతాం అని దూకుడుగా ఆలోచించేవాళ్లను దారికి తెచ్చుకోడానికి హైదరాబాద్ పోలీసులు వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు.
అజాన్ అలర్ట్..
ప్రస్తుత కరోనా విలయకాలంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని మతాల సామూహిక ప్రార్థనలపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయితే మామూలు రోజుల్లో కంటే రంజాన్ మాసంలో సామూహిక ప్రార్థనలు జోరుగా సాగుతాయి కాబట్టి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కావడంతో హైదరాబాద్ లో, ప్రత్యేకించి ఓల్డ్ సిటీలోని మసీదుల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశారు. రోజుకు ఐదు సార్లు నమాజ్ వేళలో అజాన్ తోపాటే వైరస్ వ్యాప్తిపై హెచ్చరికలు జారీచేస్తున్నారు. ‘‘ఇళ్ల నుంచి బయటికి రాకండి.. వైరస్ వ్యాప్తికి కారకులు కాకండి.. దయచేసి పోలీసులకు సహకరించడి..'' అని ప్రచారం నిర్వహిస్తున్నారు. రంజాన్ నేపథ్యంలో పోలీసులతోపాటు వైద్య బృందాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఆయా ప్రాంతాల్లో నిత్యం తిరుగుతూ ప్రజల్లో అవేర్ నెస్ కల్పిస్తున్నారు. అదీగాక..
ఓల్డ్ సిటీలో భయం భయం
తెలంగాణలో నమోదైన కొవిడ్-19 కేసుల్లో మెజార్టీ వాటా హైదరాబాద్ దే కావడం గమనార్హం. ప్రధానంగా చార్మినార్ జోన్ పరిధిలో వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి రాకపోవడం కలవరానికి గురిచేస్తున్నది. గ్రేటర్లో 450 పైగా కేసులు నమోదైతే, అందులో 200కుపైగా ఒక్క చార్మినార్ జోన్లోనే ఉన్నాయి. మర్కజీలపై తప్పు నెట్టేసి తప్పించుకోవాలని చూసిన అధికారులకు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్ తోపాటు వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించే పనిని కూడా ముమ్మరం చేసింది. అందులో భాగంగానే మసీదుల ద్వారా కరోనా అలర్టులు జారీచేస్తున్నారు.
కేసీఆర్ గిఫ్టులు.. జగన్ రూ.5వేలు
మామూలు రోజుల్లోనైతే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎల్బీ స్టేడియంలో భారీ సెటప్ వేసి, బిర్యానీ తినిపించిమరీ పేద ముస్లిం కుటుంబాలకు గిఫ్టులు పంచుతారు. ఈసారి దుస్తులకు బదులు రేషన్ సరుకుల్ని పంచాలంటూ ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేశారు. దీనిపై పండుగనాటికి ఓ క్లారిటీ వచ్చేఅవకాశముంది. గతేడాది వైస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన మూడోరోజే రంజాన్ పండుగ జరిగింది, ఈసారి భారీ వేడుకల నిర్వహిద్దామనుకున్నా, లాక్ డౌన్ కారణంగా వీలుపడటంలేదు. కుటుంబాలకు రేషన్ సరుకులతోపాటు రాష్ట్రంలోని అన్ని మసీదులు, చర్చిలు, గుడులకు తలా రూ.5వేలు ఇవ్వాలని జగన్ అధికారుల్ని ఆదేశించారు.
Recommended Video
నో హలీం..
హైదరాబాదీ బిర్యానీలాగే ఇక్కడి హలీం కూడా ఇంటర్నేషనల్ ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. రంజాన్ కోసం ముస్లింలతోపాటు ఇతర మతాలవాళ్లూ హలీం రుచిచూసేందుకే ఎదురుచూస్తారు. అలాంటి హలీంను రెస్టారెంట్లలో తినే భాగ్యం ఈసారి లేకుండా పోయింది. వైరస్ వ్యాప్తి భయాలు, లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది హలీం అమ్మకాలు చేపట్టబోమని ప్రముఖ సంస్థలన్నీ ఇప్పటికే తేల్చిచెప్పాయి. గత ఏడాది రూ.800కోట్లకు పైగా హలీం వ్యాపారం జరగ్గా, ఈ ఏడాది రూ.వేయికోట్లు దాటుందనుకున్నా, కరోనా రక్కసి అన్నింటినీ ఆగం చేసింది.