తెలంగాణా తల్లి విగ్రహంపై అసభ్యంగా పోస్టులు... వారికి తీవ్ర హెచ్చరిక!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సిద్ధమైంది . ఈనెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని 9వ తేదీన ఆవిష్కరించనున్నారు.
ఆకుపచ్చ చీరలో తెలంగాణా తల్లి
ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి చేతిలో మొక్కజొన్న కంకులు, వరి కంకులు మెడలో మూడు ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టినట్టు ఉన్న ఈ కొత్త విగ్రహం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో జరిగిన లోపాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని మరీ విగ్రహాన్ని తయారు చేయించారు.

సోషల్ మీడియాలో తెలంగాణా తల్లి విగ్రహంపై అసభ్య పోస్టులు
అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి లాగా, అలాగే ఆయన కుమార్తె లాగా ఉన్నట్టు పలువురు కొన్ని ఫోటోలను జట్టు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహం మీద సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ సోషల్ మీడియా
సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టుల నేపథ్యంలో ఆ ఛానల్స్ పైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్ కుమార్ బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ సతీష్ కుమార్ తో పాటు సోషల్ మీడియా టిపిసిసి సెక్రటరీ కైలాశ్ సజ్జన్ , జంగా శ్రీనివాసరావు, హైదరాబాద్ కోఆర్డినేటర్ విఎస్ వంశీ తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

తెలంగాణా తల్లి విగ్రహ వివాదం వెనుక
అయితే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కుమార్తె కవితను పోలి ఉందని విమర్శలు వచ్చాయి . గతంలో రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో దొరల అహంకారానికి గుర్తుగా ఉందని ఆరోపించారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని టార్గెట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్న వారికి హెచ్చరిక
సోషల్ మీడియా వేదికగా కావాలని పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తున్న వారిని హెచ్చరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కేసులు నమోదు చెయ్యాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications