స్మార్ట్సిటీ దూరం, హైదరాబాద్ వంటి చోట ఉండాలనే: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
ముంబై: స్మార్ట్ సిటీల రూపకల్పనకు కేంద్రం ఓ పక్క ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, స్మార్ట్ సిటీలను కలిగి ఉండే స్థితికి మనం ఇంకా చాలా దూరంలో ఉన్నామని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అన్నారు. ఐటీ ఇంజినీర్లు టైర్ 1 పట్టణాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
పట్టణీకరణ పైన జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ సిటీలకు చాలా దూరంలో ఉన్నందున తాను దానిపై మాట్లాడనని చెప్పారు. ఇంజినీర్లు పెద్ద పట్టణాల్లోనే పని చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.
ఇన్ఫోసిస్ మైసూరు, భువనేశ్వర్, తిరువనంతపురంలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసిందని, కానీ యాభై శాతం సీట్లు కూడా నిండలేదన్నారు. అక్కడకు వెళ్లాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. అందరు కూడా ముంబై, పుణే, బెంగళూరు, హైదరాబాద్, నోయిడాలలోనే ఉండాలని కోరుకుంటున్నారన్నారు.
జీవిత భాగస్వామికి ఉద్యోగం, పిల్లల విద్య, నాణ్యమైన వైద్య సౌకర్యాలు ఈ పరిస్థితికి కారణాలు అని చెప్పారు. అధిక ఆదాయం గల దేశాల్లో ఏదీ కూడా పట్టణీకరణ లేకుండా ప్రగతి సాధించలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం వాటిపై దృష్టి సారిస్తే సేవలు, తయారీ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందన్నారు.