అప్పులు చేయడం తప్పు కాదు, కేంద్రానికి రూ.82 లక్షల కోట్లు అప్పు: కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేయడం తప్పు కాదని తెలంగాణ సీఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు తెలంగాణ శాసనసభలో సీఎం కెసిఆర్ ప్రసంగించారు.బిజెపి సభ్యుల అభ్యంతరాలకు కెసిఆర్ సమాధానమిచ్చారు.,
రాష్ట్ర బడ్జెట్పై విపక్ష సభ్యుల ప్రశ్నలకు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానమిచ్చే సమయంలో బిజెపి సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సమయంలో సీఎం కెసిఆర్ జోక్యం చేసుకొన్నారు.

బడ్జెట్పై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానాలపై బిజెపి సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని కెసిఆర్ తప్పు బట్టారు. అనవసర ఆరోపణలు చేయడం సరైందికాదని చెప్పారు కెసిఆర్.
బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పథకాలు, సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులు చేయడం లేదా అని ప్రశ్నించారు.తమ రాష్ట్రానికి ఉన్న ఆదాయం మేరకు అప్పులు చేస్తున్నామని కెసిఆర్ గుర్తు చేశారు.
అమెరికా, జపాన్ లాంటి దేశాలు కూడ అప్పులు చేస్తున్నాయని కెసిఆర్ గుర్తు చేశారు. దేశ జీడీపీ రూ.167 లక్షల కోట్లు. అయితే దేశంలో అప్పులు రూ.82 లక్షల కోట్లుగా ఉందని సీఎం కెసిఆర్ చెప్పారు. సుమారు 49.5 శాతం అప్పులను కేంద్రం తీసుకొందని కెసిఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్ర జీఎస్డిపీలో 21 శాతం మాత్రమే అప్పులున్నాయని కెసిఆర్ ప్రకటించారు.ఉదయ్ పథకం కింద రూ.9 కోట్ల అప్పు వచ్చిందన్నారు. నాలుగేళ్ళలో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం ప్రతిపక్షాలకు కన్పించడం లేదా అని కెసిఆర్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను దేశంలోని పలు రాష్ట్రాలు మెచ్చుకొన్నాయని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాలు ఆయా పథకాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కెసిఆర్ కిట్ పథకాన్ని అమలు చేయనున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications