తాగుబోతుల అడ్డాగా మార్చేశారు: కేసీఆర్ సర్కారుపై ఇందిరాశోభన్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీనియర్ నేత ఇందిరా శోభన్. పేదల బతుకులు బుగ్గిపాలు కాకుండా ఉండాలంటే తెలంగాణలో తక్షణమే బెల్టుషాపులను రద్దు చేయాలని సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేగాక, దశలవారీగా రాష్ట్రంలో మద్యంపై నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందన్నారు.
తాగుడు వల్ల ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అనారోగ్యంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ప్రభుత్వానిది కాదా? అని ఇందిరా శోభన్ ప్రశ్నించారు. గాంధీ జయంతి పురస్కరించుకొని మద్యపాన నియంత్రణ, బెల్ట్ షాపులను రద్దు చేయాలంటూ ప్యారడైజ్లోని గాంధీ విగ్రహం దగ్గర మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రికి మేలుకొలుపు కలిగేలా జ్ఞానాన్ని ప్రసాదించాలంటూ గాంధీ విగ్రహానికి ఆమె విజ్ఞాన పత్రం అందజేశారు.

గ్రామ స్వరాజ్యంతో దేశ సౌభాగ్యం అన్న గాంధీ సందేశం నేటి పాలకులకు పట్టడం లేదని ఇందిరాశోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ మరో స్వప్నం- సంపూర్ణ మద్య నిషేధమేనని గుర్తు చేశారు. సకల అనర్ధాలకు మూల కారణం అవుతున్న మద్యపాన నియంత్రణను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. మద్యం ఆదాయమే మహాప్రసాదంగా భావించే దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగాల తెలంగాణను.. తాగుబోతుల అడ్డాగా మార్చిన పాపం ఈ ప్రభుత్వానిదేనని విమర్శించారు. తాగుడు వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని నడపడం సిగ్గుచేటని విమర్శించారు ఇందిరాశోభన్.
ఒకవైపు సంక్షేమ మంత్రం జపిస్తూనే పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లు గుల్ల చేస్తున్నారని ఆరోపించారు. మద్యం ఆదాయం మీదనే ఆశలుపెంచుకుని బడ్జెట్ రూపొందించే స్థాయికి దిగజారిపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో మద్యం ఆదాయం రూ.10వేల కోట్లు ఉంటే..ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే రూ.30వేల కోట్ల ఆదాయం రావడమంటే ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆదాయం కోసం మద్యం షాపులకు విచ్చల విడిగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పల్లెల్లో గల్లి గల్లీకో బెల్ట్ షాపు ఏర్పడటం అడ్డూ అదుపులేని మద్యం అమ్మకాలకు నిదర్శనమన్నారు. తెలంగాణలో మంచినీళ్లు దొరకని ఊరు ఉంటుందేమో గానీ మద్యం దొరకని గ్రామాలు లేవన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇది ప్రభుత్వం సాధించిన ఘన విజయమని ఇందిరా శోభన్ ఓపెన్ ఎద్దేవా చేశారు.
ఉద్యోగాలు రాక, ఉపాధి లేక నిరుద్యోగ యువత మద్యానికి బానిసలై, బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని ఇందిరాశోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకాల్లో రిజర్వేషన్లు కాదు.. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువత రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ప్రజాసంక్షేమమే తమ ధ్యేయమని చెప్పుకునే నేతలు నిరుపేదలు ఇలా బలైపోతున్నా డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలంటూ ఆవేదనగా ప్రశ్నించారు. మద్యం మత్తులో మహిళలు, పసిపిల్లలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వాలకు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. తెలంగాణ ప్రజలు, యువత సంక్షేమం గురించి మాట్లాడే ఈ ప్రభుత్వం తక్షణమే మద్యం మహమ్మారిని దశల వారిగా నియంత్రించాలని, తెలంగాణ వ్యాప్తంగా బెల్టు షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మద్యం మహమ్మారి నిర్మూలన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇందిరా శోభన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications