నగరంలో వినూత్నంగా ఫివర్ తనిఖీలు.!ఒక్కరోజే 641బృందాలతో 40వేల ఇళ్లలో జీహెచ్ఎంసీ సర్వే.!
హైదరాబాద్ : నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ అనూహ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని కార్యక్రమానికి ప్రణాళిక రచించింది. కరోనా లక్షణాల్లో మొదటగా జ్వరం రావడం, ఆ అంశాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేయడం, దీంతో కరోనా వ్యాది ముదిరి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం నగరంలో సర్వ సాదారణంగా జరిగిపోతునన్నాయి. ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టాలని నగరపాలక సంస్థ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఓ బృహత్కర కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.
జీహెచ్ఎంసీ అనూహ్య సర్వే.. జ్వరం సర్వే నిర్వహిస్తున్న సగరపాలక సంస్థ..
గ్రేటర్ హైదరాబాద్ లో కొత్త నగరపాలక సంస్థ కొలువుదీరిన దగ్గర నుండి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి వరకూ ప్రత్యేక శానిటైజేషన్ డ్రైవ్ పేరుతో దాదాపు 15రోజుల పాటు పరిశుబ్రత మీద దృష్టి సారించిన నగర పాలక సంస్థ తాజాగా మరో కీలక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ లకు చెందిన 641 బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరం, కోవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్ద ఎత్తున చేపట్టాయి.
వెలుగు చూస్తున్న జ్వరం కేసులు.. స్పాట్ లో మందులు, కరోనా కిట్ లు అందజేస్తున్న జీహెచ్ఎంసీ..
ఒక్కో బృందంలో ఒక ఏ.ఎం.ఎం, ఆశ వర్కర్, జీహెచ్ఎంసీ ఎంటమాలజి వర్కర్ తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి ధర్మోస్కానర్ తో మంగళవారం ఒక్కరోజే 40వేల ఇళ్లలో సర్వేను చేపట్టగా వీరిలో 1487 మంది జ్వరంతో ఉన్నారని గుర్తించారు. ఈ జ్వరంతో బాధపడుతున్న 1487 మందిలో 1400 మందికి వెంటనే కోవిడ్ మందుల కిట్ అందజేశారు. జ్వరంతో బాధపడుతున్నవారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ ఫీవర్ సర్వేలో జ్వరానికి సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు.
విడ్ అవుట్ పేషంట్ లకు పరీక్షలు.. అవసరం అనుకుంటే ఆసుపత్రులకు తరలింపు..
అనూహ్యంగా సోమవారం నుండి నగరంలో ప్రారంభమైన ఈ ఫీవర్ సర్వేలో ప్రాథమికంగా 393 సర్వే బృందాలు పాల్గొన్నాయి. నేడు మంగళవారం నాడు ఈ బృందాల సంఖ్య 641 కు పెరగడంతో నేడు ఒక్కరోజే 40 వేల ఇళ్లలో ఈ ఫివర్ సర్వే ముమ్మరంగా సాగింది. నగరంలోకి ప్రతీ బస్తి దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావఖానాలలో కోవిడ్ అవుట్ పేషంట్ కు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నేడు అన్ని ఆసుపత్రుల్లో 18600 మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
మంచి ఫలితాలిస్తున్న సర్వే.. ప్రశంసలు అందుకుంటున్న జీహెచ్ఎంసీ..
వీటిలో 3,600 మందికి స్వల్ప జ్వరాలు ఉన్నట్టు గుర్తించి వారికి కరోనా నివారణ మందుల కిట్లను అందజేశారు. కాగా తమ పరిధిలో చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే, ఆసుపత్రుల్లో జరిపిన ప్రాథమిక వైద్య పరిక్షలను సంబంధిత జోనల్, డిప్యూటీ కమీషనర్లు, మెడికల్ ఆఫీసర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్ కు కేవలం కరోనా సంబంధిత సలహాలు, సూచనలకు గాను వచ్చిన దాదాపు 250 ఫోన్ కాల్స్ కు ప్రత్యేకంగా నియమించిన వైద్యాధికారులు తగు సలహాలు, సూచనలు అందించినట్టు అధికారులు తెలిపారు.