భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అవమానం; సోనియాగాంధీ దిష్టిబొమ్మల దహనానికి బండి సంజయ్ పిలుపు!!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గురువారం బీజేపీ నిరసన చేపట్టనుంది. అధీర్ రంజన్ తొలగింపునకు వ్యతిరేకంగా బీజేపీ అనేక రాష్ట్రాలలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతోంది.
రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధీర్ రంజన్ .. బండి సంజయ్ ఫైర్
ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ లోకసభ పక్ష నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపత్ని అన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎస్టి మహిళ రాష్ట్రపతి పీఠం ఎక్కడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు. రాష్ట్రపతి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే దేశ ప్రజలందరినీ అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
అన్ని జిల్లా కేంద్రాలలో సోనియా గాంధీ దిష్టిబొమ్మల దహనాలకు పిలుపు
నేడు అధీర్ రంజన్ వ్యాఖ్యలకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాలలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేయాలని బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు. అధీర్ రంజన్ వ్యాఖ్యలపై సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న గిరిజనుల గుర్తింపుకు ప్రతీక అయిన ద్రౌపది ముర్మును అవమానించడం కాంగ్రెస్ పార్టీ నాయకుల సంస్కృతికి అద్దం పడడమే కాకుండా ద్వేషాన్ని ప్రదర్శించడమేనని పలువురు బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భోపాల్ లోనూ బీజేపీ ఆందోళన.. గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు ర్యాలీ
కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నేడు మధ్యాహ్నం 1 గంటలకు, భారతీయ జనతా పార్టీ భోపాల్లోని గాంధీజీ విగ్రహం నుండి రాజ్భవన్ వరకు కవాతు నిర్వహించి, అధీర్ రంజన్ తొలగింపునకు గవర్నర్ కు మెమోరాండం సమర్పించనుంది.రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపత్ని అని సంబోధించడం దేశాన్ని, రాజ్యాంగ స్థానాన్ని అవమానించడమేనని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రపత్ని అంటూ రాష్ట్రపతిపై అధీర్ రంజన్ అనుచిత వ్యాఖ్యలు.. పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్
ఇలాంటి చెడు మనస్తత్వం ఉన్న వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడం కాంగ్రెస్కు బాధ కలిగిస్తోందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గిరిజనులను చిన్నచూపు చూస్తుందని మండిపడుతున్నారు. దేశానికి రాష్ట్రపతి అయిన మహిళా అధ్యక్షురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ అధీర్ రంజన్ చౌదరిపై చర్య తీసుకుని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.