చదువుకోమనడమే పాపమా?: డిగ్రీ విద్యార్థిని హతమార్చిన ఇంటర్ విద్యార్థులు
నిజామాబాద్: చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగబడుతున్నారు కొందరు నేటితరం యువత. తాజాగా, ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. పరీక్షలున్నాయి మంచిగా చదువుకోమని చెప్పినందుకు.. ఓ డిగ్రీ విద్యార్థిని.. ఇంటర్ విద్యార్థులు హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని తిప్పారం తండాకు చెందిన వెంకట్ (23) అనే యువకుడు బోధన్ పట్టణంలో బీసీ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో.. అదే హాస్టల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు అల్లరి చేయకుండా చదువుకోవాలని సూచించాడు.

అయితే, తమ మంచికే చెప్పాడని అనుకోకుండా.. అతనిపై కక్ష పెంచుకున్నారు ఆ విద్యార్థులు. ఈ క్రమంలోనే వెంకట్ పడుకున్నాక గొంతు నులిమి చంపినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెంకట్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, వెంకట్ మృతిపై అతని తరఫు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంకట్ రాత్రికే మరణించగా.. హాస్టల్ వార్డెన్ మాత్రం ఉదయం వరకు తమకు సమాచారం అందించలేదని చెబుతున్నారు. హత్యకు పాల్పడిన విద్యార్థులను పట్టుకోలేదని, ఇంత జరిగినా ఏం పట్టనట్లుగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు గొడవపడిన సమయంలో వార్డెన్, హాస్టల్లో లేకపోవడంతోనే వెంకట్ మరణానికి దారితీసిందన్నారు. తక్షణమే హాస్టల్ వార్డెన్, వాచ్మెన్పై చర్యలు తీసుకోవాలని వెంకట్ బంధువులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications