T Congress జాబితాలో కొత్త ట్విస్టులు - గెలుపు లెక్క ఇదేనా..!!
తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైంది. 55 మందితో కాంగ్రెస్ జాబితాను ప్రకటించింది. వామపక్షాలతో పొత్తు ఖాయమైంది. తొలి జాబితాలో వివాదాలకు తావు లేని స్థానాలను ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ కు అభ్యర్దిని ఖరారు చేసిన కాంగ్రెస్ కామారెడ్డికి ఇంకా ప్రకటించలేదు. అదే సమయంలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. రేవంత్ టీంకు సీట్లు దక్కాయి. ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.
మారుతున్న లెక్కలు: తెలంగాణలో అధికారం ఖాయమనే నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ తమ అభ్యర్దులను ఖరారు చేసింది. విడుదల చేసిన తొలి జాబితాలో కొత్త లెక్కలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో55 మందిని ప్రకటించగా, అందులో 12 మంది కొత్తగా పార్టీలో చేరిన వారికి అవకాశం కల్పించారు. 11 మంది ఎస్సీలకు..రెండు స్థానాలు ఎస్టీలకు..9 మంది బీసీలకు కేటాయించారు.

హైదరాబాద్ పాతబస్తీలో అభ్యర్దులను తొలి జాబితాలోనే ప్రకటించారు. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి కుటుంబానికి రెండు సీట్లు కేటాయించారు. మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి..మెదక్ నుంచి ఆయన కుమారుడికి సీటు ఖరారు చేసారు. నకరికల్ నుంచి వేముల వీరేశం కే సీటు దక్కింది.
ఎమ్మెల్యేలుగానే బరిలోకి: పార్టీ ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు ఈ సారి నాగార్జున సాగర్ నుంచి పోటీలో నిలుస్తున్నారు. జానారెడ్డి పోటీ నుంచి విరమించుకున్నట్లు స్పష్టం అవుతోంది.
ఇక, కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి నర్సారెడ్డిని ఖరారు చేసిన కాంగ్రెస్..మరోస్థానం కామారెడ్డి నుంచి మాత్రం అభ్యర్దిని ప్రకటించలేదు. అక్కడ నుంచి సీనియర్ నేత షబ్బీర్ అలీ పోటీ చేయాలని భావిస్తున్నారు. అదే విధంగా ఈ సారి బీసీలకు సీట్లు ఎక్కవ ఇవ్వాలనే డిమాండ్ ఉంది. బీసీ నేతలుగా ఉన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ సీటు ఆశిస్తున్నారు. వీహెచ్ అంబర్ పేట స్థానం కోరుకుంటున్నారు. ఈ రెండు సీట్లు ఈ జాబితాలో లేవు.
The CEC has sanctioned the following candidates for the ensuing elections to the Legislative Assembly of Telangana. pic.twitter.com/kdt2CnjOla
— Telangana Congress (@INCTelangana) October 15, 2023
కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత: మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను ముషీరాబాద్ నుంచి బరిలోకి దింపుతోంది. జహీరాబాద్ స్థానం ఆగం చంద్రశేఖర్ కు కేటాయించారు. మాజీ మంత్రి గీతారెడ్డి అనారోగ్య కారణాలతో ఈ సారి పోటీకి దూరంగా ఉంటున్నారు. ఇక..రేవంత్ టీంకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. సీతక్కకు ములుగు ఖరారు అయింది.
పెద్దపల్లి నుంచి చింతకుంట్ల విజయ రమణరావుకు సీటు కేటాయించారు. కల్వకుర్తి నుంచి కసిరెడ్డిన నారాయణ రెడ్డికి సీటు ఖరారు చేసారు. అయితే, ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి, తుమ్మల సీట్లు ఈ జాబితాలో లేవు. తాజాగా తుమ్మలకు ఖమ్మం..పొంగులేటికి పాలేరు సీట్లు ఇచ్చేలా నిర్ణయం జరిగింది. అయితే, తుది జాబితా విడుదల తరువాత కాంగ్రెస్ సీట్ల కేటాయింపు పైన నేతల స్పందన ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications