అంతర్జాతీయ మిఠాయిల పండుగ.. వెయ్యికి పైగా నోరూరించే స్వీట్స్ !
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో అంతర్జాతీయ మిఠాయిల పండుగను నిర్వహిస్తోంది. పతంగుల పండుగతో పాటు పరేడ్ మైదానంలో ఈ నెల 13 నుంచి రెండు రోజుల పాటు మిఠాయిల పండుగ జరగనుంది.
ఈ ఫెస్టివల్లో వెయ్యికి పైగా నోరూరించే మిఠాయిలను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన పోస్టర్ను గురువారం సచివాలయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సహా పలువురు అధికారులు విడుదల చేశారు.
నగరంలో నివాసముంటోన్న సుమారు 15 రాష్ట్రాలకు చెందిన మహిళలు నోరూరించే రకరకాల మిఠాయిలను ఇంటి నుంచే తయారుచేసి పరేడ్ గ్రౌండ్కు తీసుకురానున్నారని తెలిపారు.
మినీ భారతాన్ని ఆవిష్కరించే వేదికగా దేశంలోనే తొలిసారిగా ఈ అంతర్జాతీయ మిఠాయిల పండుగను నిర్వహిస్తున్నట్లు మంత్రి చందూలాల్ పేర్కొన్నారు. సరికొత్త తరహాలో జరిగే ఈ వేడుకలకు సుమారు లక్ష మందికిపైగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.