Telangana: రాష్ట్రానికి భారీగా పెరిగిన పెట్టుబడి ప్రతిపాదనలు..
తెలంగాణకు పెట్టుబడి ప్రతిపాదనలు పెరిగాయి. 2020-21లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలతో పోలిస్తే 2021-22లో తెలంగాణకు వచ్చిన కొత్త పెట్టుబడి ప్రతిపాదనలు 150 శాతం పెరిగాయని ఓ నివేదిక తెలిపింది. MSME ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీల అధ్యయనం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. 2020-21లో రూ. 31,274.56 కోట్ల విలువైన ప్రతిపాదనలు రాగా.. 2021-22 సంవత్సరంలో రూ.76,568.89 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్లు నివేదిక పేర్కొంది.
పెట్టుబడులతో 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయని వివరించింది. తెలంగాణలో పెట్టుబడులు, అభివృద్ధిపై అధ్యయన నివేదికను ఎంఎస్ఎంఈ ఛైర్మన్ డాక్టర్ డీఎస్ రావత్ విడుదల చేశారు. 2021-22లో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు భారీగా పెరిగాయన్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.14,882.35 కోట్ల నుంచి రూ.60,618.05 కోట్లకు చేరుకుందని చెప్పారు.

ఇందులో రూ. 5413.39 కోట్ల పూర్తయిన ప్రాజెక్టులు, రూ. 1159.00 కోట్ల విలువైన ప్రాజెక్టుల పునరుద్ధరణ. రూ.2,36,383.74 కోట్ల మొత్తం పెట్టుబడి ప్రాజెక్టులు ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలు కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 12.4 శాతం వృద్ధి చెందగా.. 2021-22లో 9.09 శాతం వృద్ధిని సాధించాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, పాలసీ సపోర్టు వల్ల ఇది సాధ్యమైందని నివేదిక వివరించింది.

ఐటీ రంగంలో ఉపాధి 3,71,774 నుంచి 7 లక్షలకు పైగా పెరగిందని నివేదిక పేర్కొంది. సెమీ-అర్బన్, గ్రామీణ రంగాలలో పెద్ద సంఖ్యలో సూక్ష్మ, అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయాలనే ప్రణాళికతో, 2.6 మిలియన్ల MSMEలలో 56 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 44 శాతం పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.












Click it and Unblock the Notifications