ప్రత్యేక హోదా: బిజెపిది బాబుకు దూరం జరిగే ప్రయత్నమా?
హైదరాబాద్: ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దాదాపు వదిలించుకున్న భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను వదిలించుకోవాలని చూస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ప్రత్యేక హోదా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీని వదిలించుకునేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కేంద్రమంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా లేదని పార్లమెంటు సాక్షిగా వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు.
బీజేపీ నేతలు విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని చెబుతున్నారని, ఏడు మండలాలను ఏపీలో కలపాలన్న విషయం విభజన చట్టంలో ఉందా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలో అది లేనప్పుడు ఎలా కలిపారన్నారు. అలాగే ఏపీకి కూడా ప్రత్యేక హోదా కల్పించవచ్చు కదా అని ప్రశ్నించారు.
గతంలో ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రాలన్నింటికీ నీతి ఆయోగ్ హోదా ఇవ్వాలని చెప్పిందా అని నిలదీశారు. లేకపోతే రాజ్యాంగంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు అవకాశంలేని ఆర్టికల్ ఏదైనా ఉందా అన్నారు. ప్రత్యేక హోదా కల్పించడం అనేది రాజకీయ నిర్ణయమన్నారు.
తెలుగుదేశం పార్టీతో తమకు ఉపయోగం లేదని భావిస్తున్న బిజెపి ఆ పార్టీని వదిలించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమే తాజా ప్రకటన అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తెలంగాణలో టిడిపి - బిజెపి మధ్య దాదాపు దూరం పెరిగిపోయింది. ఏపీలో మాటల ద్వారా దూరం కనిపిస్తోంది. ఈ కోణంలోనే బిజెపి హోదాపై తాజా ప్రకటన చేసి ఉంటుందని అంటున్నారు.