Huzurabad: హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దాదాపుగా ఖరారు...? ఆ నేత వైపే మొగ్గుచూపిన గులాబీ బాస్...
హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి అన్వేషణలో తీవ్ర తర్జనభర్జన పడుతున్న గులాబీ బాస్ కేసీఆర్ ఎట్టకేలకు ఒక పేరును ఫైనల్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు దీనిపై ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. దళిత బంధు పథకం ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజురాబాద్లో పర్యటించనున్న కేసీఆర్... అదే రోజు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఉపఎన్నిక అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఎట్టకేలకు కొలిక్కి... కౌశిక్ రెడ్డికే ఇవ్వాలనుకున్నప్పటికీ...
హుజురాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి కోసం కేసీఆర్ చాలామంది పేర్లను పరిశీలించారు.మొదట మాజీ ఎంపీ వినోద్,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్,మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు ముద్దసాని పురుషోత్తం రెడ్డి,ఆయన సతీమణి ముద్దసాని మాలతి తదితరుల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి,గెల్లు శ్రీనివాస్ యాదవ్,స్వర్గం రవిల పేర్లు పరిశీలనా జాబితాలో చేరాయి. నిజానికి ఒక దశలో కౌశిక్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావించినప్పటికీ... ఫోన్ కాల్ లీక్ వ్యవహారంతో ఆ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెట్టి మరొకరికి అవకాశం ఇవ్వాలని భావించినట్లు సమాచారం.

గెల్లుకు కలిసొచ్చే అంశాలు...
కౌశిక్ రెడ్డి పేరును పక్కనపెట్టడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తే బాగుంటుందని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పొనుగంటి మల్లయ్య,వకుళాభరణం కృష్ణమోహన్,గెల్లు శ్రీనివాస్ యాదవ్ల పేర్లను పరిశీలించిన కేసీఆర్... చివరకు గెల్లు వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.తొలి నుంచి పార్టీతో ఉన్న నేత,ఉద్యమకారుడు కావడంతో గెల్లు శ్రీనివాస్కే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.హుజురాబాద్ నియోజకవర్గానికే చెందిన నేత కూడా ఆయనకు కలిసొచ్చే అంశం. గతంలో టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా పనిచేసిన బాల్క సుమన్కు కేసీఆర్ ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఇవ్వగా.. వరుసగా రెండుసార్లు ఆయన గెలుపొంది తన సత్తా నిరూపించుకున్నారు.గతంలో పెద్దపల్లి ఎంపీగా పనిచేసిన ఆయన,ప్రస్తుతం చెన్నూర్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా ఉన్న గెల్లు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారా లేదా వేచి చూడాలి.

ముమ్మరంగా ప్రచారం... దళిత బంధుపై ఆశలు...
హుజురాబాద్ ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. కీలక నేతలు,మంత్రులు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ను ప్రకటించాక ప్రచారాన్ని మరింత స్పీడప్ చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే నియోజకవర్గంలో సంక్షేమ,అభివృద్ది పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. కేసీఆర్ దళిత బంధు స్కీమ్ ప్రకటించిన నేపథ్యంలో... ఆ సామాజికవర్గం ఓట్లన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్కే పడతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లు దళితులవే కావడంతో.. ఆ సామాజికవర్గం తమ వెంట ఉంటే గెలుపు సునాయాసమే అని భావిస్తున్నారు. అయితే దళిత బంధును ఉపఎన్నికకు ముందే అమలుచేస్తారా... లేక ఉపఎన్నిక తర్వాత అమలుచేస్తారా అన్న అంశాలు ఎన్నికను ప్రభావితం చేయవచ్చు. ఇప్పటికైతే టీఆర్ఎస్ తమదే గెలుపు అన్న ధీమాతో ఉంది. ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చి,ఎన్నిక ముగిసే లోపు ఎవరి బలం తగ్గుతుందో,ఎవరి బలం పెరుగుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications