గవర్నర్,సీఎం కేసీఆర్ ల మధ్య కరోనా చిచ్చు పెట్టిందా ? సీరియస్ గా గవర్నర్ సమీక్షల మతలబు అదేనా ?
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య కరోనా చిచ్చు పెట్టిందా ? ఒక పక్క రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా సీఎం కేసీఆర్ దృష్టి సారించడం లేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తెలంగాణ గవర్నర్ కరోనా విషయంలో దృష్టి సారించారా ? తెలంగాణ సీఎస్, హెల్త్ సెక్రెటరీ కి రావాలని కబురు పంపించినా గవర్నర్ ఆదేశాలను పక్కన పెట్టి రాలేమని సందేశం పంపడం వెనక సీఎం కేసీఆర్ వున్నారా ?దీంతో గవర్నర్ సీరియస్ గా ఉన్నారా ? ఇవి ఇప్పుడు గవర్నర్, సీఎం కెసిఆర్ ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన అంశాలు.
చీఫ్ సెక్రటరీకి గవర్నర్ తమిళిసై పిలుపు .. రాలేమంటూ చీఫ్ సెక్రటరీ జవాబు
కరోనా పరిస్థితిపై గవర్నర్ తమిళిసై సమీక్షా సమావేశం
కరోనా మహమ్మారి... ఒక తెలంగాణ రాష్ట్రాన్ని కాకుండా యావత్ ప్రపంచాన్ని గజ గజ వణికిస్తున్న మహమ్మారి. ఈ మహమ్మారి తో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో గాంధీ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని, ఇక ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల విమర్శలు, ప్రజల విన్నపాలు గవర్నర్ తమిళిసై వరకు చేరాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ఎక్కడ అంటూ వెల్లువగా మారిన విమర్శలు కూడా గవర్నర్ దగ్గారకు వెళ్ళాయి. దీంతో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం పై సీరియస్ గా ఉన్న గవర్నర్ తమిళిసై కరోనా పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారని సమాచారం.
గవర్నర్ స్వయంగా సమీక్షలు చెయ్యటం నచ్చని తెలంగాణా సర్కార్
ఇక ఇదే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇబ్బందికర పరిణామం. గవర్నర్ గా తమిళిసై ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది కానీ, ఆమె స్వయంగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తే పరిపాలన అధికారాలను చేతుల్లోకి తీసుకున్నట్లుగా ఉంటుందని భావించి సి ఎస్, మరియు హెల్త్ సెక్రటరీ చేత రాలేమని చెప్పించినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కరోనా ఫిర్యాదులపై గవర్నర్ తమిళిసై తానే ప్రభుత్వంలా చేతుల్లోకి తీసుకోవడం సరికాదు అనే భావన అంతర్గతంగా ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
సమీక్షకు రాలేమని సీఎస్ , హెల్త్ సెక్రటరీ జవాబే ఇంత చర్చకు కారణం
ఇప్పటికే కెసిఆర్ ఎక్కడ అని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న వేళ గవర్నర్ తలపెట్టిన సమీక్ష సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హెల్త్ సెక్రటరీ శాంతి కుమారి హాజరైతే తెలంగాణ రాష్ట్రంలో పాలన పై తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఆలోచనతో తమిళిసై సమీక్ష సమావేశానికి రాలేమని, అప్పటికే నిర్ణయించిన కార్యక్రమాలలో బిజీగా ఉన్నామని ప్రభుత్వమే సీఎస్, హెల్త్ సెక్రటరీ తో చెప్పించారు అని సమాచారం. రాజ్ భవన్ నుండి పిలుపు వస్తే హుటాహుటిన వెళ్లాల్సిన అధికారులు,నిర్దేశించుకున్న ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున హాజరు కాలేమని సమాధానం ఇవ్వడమే ఇంత చర్చకు ప్రధాన కారణం.
ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో గవర్నర్ సమీక్ష
అయితే రాష్ట్రంలో కరోనా వ్యవహారంలో, అలాగే అధికారులు సమాధానం ఇచ్చిన తీరుతో తీవ్ర అసహనం తో ఉన్న గవర్నర్ తమిళిసై ఈరోజు కరోనా చికిత్సలో దోపిడీపై తనకు అందిన ఫిర్యాదుల మేరకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీ అయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహిస్తున్నారు గవర్నర్ తమిళి సై.
స్వయంగా కరోనా విషయంలో రంగంలోకి దిగిన గవర్నర్ తమిళిసై
కరోనా ఐసోలేషన్ సౌకర్యం ఉన్న ఆసుపత్రులలో వసతులతో పాటు, చికిత్స, పడకలు, బిల్లులు, పరీక్షలు, ప్రైవేటు ఆసుపత్రులపై ప్రజల ఫిర్యాదులపై కూడా సమీక్షలో తమిళిసై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గవర్నరే స్వయంగా రంగంలోకి దిగి ఆస్పత్రి వర్గాలతో సమీక్ష చేపట్టినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఈ వ్యవహారంలో తమిళిసై జోక్యం చేసుకోవడం తెలంగాణ సర్కార్ ను ఇబ్బంది పెడుతోంది. ఇక తాను కబురు పంపినా రాలేమన్న అధికారుల తీరుపై తీవ్ర అసహనం తో ఉన్న తమిళిసై నేడు స్వయంగా రంగంలోకి దిగి సమీక్ష నిర్వహిస్తుండడం గమనార్హం.