కెసిఆర్ మౌనం, కెటిఆర్ దూకుడు: అసలేం జరుగుతోంది?
కెసిఆర్ చాలా కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో కెటిఆర్ దూకుడు పెంచారు. దీని వెనక అసలు కథ వేరే ఉందని అంటున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజల అభిమానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు క్రమంగా కోల్పోతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కెసిఆర్ ప్రజలకు హామీల మీద హామీలు ఇస్తూ వెళ్లారు. గుండుగుత్తగా కాకుండా ఏ వర్గానికి ఆ వర్గానికి కూడా ప్రత్యేక వరాలు ప్రకటిస్తూ వచ్చారు.
చిన్నపాటి హామీలు మాత్రమే ఇప్పటి వరకు అమలవుతూ వస్తున్నాయి. భారీ హామీలు ఎప్పుడు అమలవుతాయనేది తెలియడం లేదు. ఈసారి వర్షాలు పడడం వల్ల తెలంగాణలో వ్యవసాయం కాస్తా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. మిషన్ కాకతీయ కారణంగా కొన్ని చోట్ల చెరువులు కూడా నిండాయి. ఇది కొంత ఊరట.
అదే సమయంలో కరెంట్ కోతలు లేకపోవడం పెద్ద ఊరటగానే చెప్పాలి. కానీ, ఇతర హామీల విషయంలో కెసిఆర్ వెనకబడి పోతున్నారనే అభిప్రాయం కలుగుతోంది. వాటిని ఆసరా చేసుకుని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువతలో వ్యతిరేకత పేరుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
అసలు కెటిఆర్ ఏమన్నారు....
నమస్తే తెలంగాణ సిబ్బందితో జరిగిన సమావేశంలో కెటిఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నట్లు వినికిడి. అయితే, కాస్తా నిర్మొహమాటంగా మాట్లాడే ఉద్యోగులు ప్రభుత్వం తీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. అది అలాగే ఉంటుందని, నమస్తే తెలంగాణ సిబ్బంది సాధ్యమైనంత వరకు ఫీల్ గుడ్ వాతావరణం ఏర్పడడానికి కృషి చేయాలని, ఆ రకంగా పత్రికను తీర్చి దిద్దాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో..
నీటి పారుదల ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని వాతావరణం ఉందని అంటున్నారు. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోని తీవ్ర కరువు తాకిడి ప్రాంతాల్లో కాస్తా వ్యవసాయం పుంజుకున్నట్లు చెబుతున్నారు. కానీ, అది సరిపోదని అంటున్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీ తీరుకు, దానికి పొంతన కుదరడం లేదని అంటున్నారు. మరోవైపు, ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆయన దూకుడు తగ్గిందా....
కెసిఆర్ దూకుడు తగ్గినట్లు కనిపిస్తోంది. ఆయన ప్రజలకు ఇచ్చే హామీల విషయంలో గానీ ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పే విషయంలో గానీ దూకుడు తగ్గించారని అంటున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక మిగతా పత్రికలతో పోలిస్తే సారవంతమైన, పకడ్బండీ వార్తలు ఇవ్వడం లేదనే అసంతృప్తి కెసిఆర్లో పేరుకుపోయినట్లు చెబుతున్నారు. హేతుబద్దమైన వార్తాకథనాలు ఇవ్వడంలో విఫలమైందనే అభిప్రాయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చాలా వారకు మౌనంగా ఉంటున్నారు.
కెటిఆర్ దూకుడు ఎందుకు పెంచారు...
ఇటీవలి కాలంలో కెటిఆర్ దూకుడు పెంచారు. ఈ దూకుడు వెనక బలమైన కారణం ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పార్టీని పూర్తిగా చేతుల్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెటిఆర్కు పూర్తి బాధ్యతలు అప్పగించి, తాను వెసులుబాటు కల్పించుకోవాలనే ఉద్దేశంతో కెసిఆర్ ఉన్నట్లు కనిపిస్తున్నారని అంటున్నారు.
హరీష్ మాట కెటిఆర్కు అనుకూలమా...
కెటిఆర్కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే హరీష్ రావు ఏం చేస్తారనే ఆందోళన ఉంటూ వచ్చింది. తాను కెసిఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని హరీష్ రావు ఒక సందర్భంలో చెప్పారు. అది కెటిఆర్కు అనుకూలమనే మాట వినిపిస్తోంది. అయితే, కెటిఆర్కు పార్టీ పగ్గాలు అప్పగించి, కెసిఆర్ తన వారసుడిగా కెటిఆర్ను ముందుకు తెస్తే హరీష్ రావు నిజంగానే మౌనంగా ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయమే.