మనసు మార్చుకున్న కోమటిరెడ్డి-రేవంత్తో కలిసే సాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా..?
టీపీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసహనాన్ని,అసంతృప్తిని వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ తన వ్యాఖ్యలతో పార్టీలో కలకలం రేపిన కోమటిరెడ్డి... ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. పార్టీతో విభేదించడం కంటే మునుపటి లాగే సఖ్యతతో కలిసి సాగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

కోమటిరెడ్డి ఏమన్నారు...
తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవినే త్యజించిన తనకు పదవులు లెక్క కాదని కోమటిరెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్ పదవిని రూ.25 కోట్లకు అమ్ముకున్నారని గతంలో తాను చేసిన వ్యాఖ్యలు... కేవలం ఆవేదనతో చేసినవే తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. అన్ని అర్హతులు ఉన్నప్పటికీ టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోతే బాధగానే ఉంటుందన్నారు. ఆ బాధలోనే విమర్శలు చేశాను తప్ప వేరే ఉద్దేశాలేవీ తనకు లేవని స్పష్టం చేశారు.

వేరే పార్టీలు ఆహ్వానించాయి.. కానీ...
పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని కోమటిరెడ్డి కూడా ఖండించారు. తనకు వేరే పార్టీల నుంచి ఆహ్వానం వచ్చిన మాట నిజమేనని... కానీ తాను పార్టీ మారనని స్పష్టం చేశారు. పార్టీలో పరిణామాలపై విమర్శలు చేసినంత మాత్రాన పార్టీ మారినట్లేనా అని ప్రశ్నించారు. భువనగిరిలో పార్టీ కార్యకర్తలు పైసా తీసుకోకుండా తనకోసం పనిచేశారని గుర్తుచేసుకున్నారు. అటువంటి పార్టీని,కార్యకర్తలను వదిలి తాను వేరే పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు.కొత్త కార్యనిర్వాహక వర్గం గాంధీ భవన్కు లేదా స్పీచ్లకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తేనే గెలుస్తామన్నారు. కోమటిరెడ్డిని వైఎస్ షర్మిల తన పార్టీలోకి ఆహ్వానించారన్న ప్రచారం నేపథ్యంలో పార్టీ మార్పుపై ఆయన స్పందించారు.
Recommended Video

కలిసి నడిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా...?
రేవంత్ టీపీసీసీ చీఫ్గా నియమితులయ్యాక దాదాపుగా అందరు నేతలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. తాను అందరివాడిని అనిపించేందుకు పార్టీకి చెందిన కీలక నేతలందరితో భేటీ అయి... తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వారిని స్వయంగా ఆహ్వానించారు. గతంలో తనపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసిన వీహెచ్ లాంటి సీనియర్ నేతలను సైతం కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,మర్రి శశిధర్ రెడ్డిలు మాత్రమే రేవంత్ను దూరం పెడుతూ వస్తున్నారు. కొత్త కార్యనిర్వాహక వర్గంగా ఎంపికైనవారు తనను కలిసేందుకు రావొద్దని కోమటిరెడ్డి గతంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ రూ.25 కోట్లకు టీపీసీసీ చీఫ్ పదవిని అమ్ముకున్నాడని ఆరోపించారు. అయితే తాజాగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఆయన మెత్తబడినట్లు కనిపిస్తోంది. ఆవేదనలో చేసిన విమర్శలే తప్ప తనకు మరో ఉద్దేశం లేదని ఆయన చెప్పారంటే... రేవంత్తో కలిసి నడిచేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications