కేసీఆర్ పక్కన పెట్టారా, కొండా సురేఖ అసంతృప్తి?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ అలక వహించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కీలక నేతగా కనిపించారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమె తెరాసలో చేరారు. అయితే, ఎన్నికల అనంతరం మంత్రి పదవి రాలేదు. దీంతో, అప్పటి నుండి ఆమె అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపించాయి. గత పార్టీల్లో కీలక నేతగా కనిపించిన సురేఖ తెరాసలో అంతగా కనిపించడం లేదనే చెప్పవచ్చు.
మంత్రి పదవిని పక్కన పెట్టినా.. తన భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఈసారి ఆయనకు అవకాశం రాలేదు. దీంతో, సురేఖ మరింత మనస్థాపం చెందారని అంటున్నారు.

గత నెల 28వ తేదీన తెరాస యువ నాయకుడు వివాహానికి కేసీఆర్ వరంగల్లో హాజరయ్యారు. ఈ సందర్భంలో సురేఖ అసంతృప్తి కొంత కనిపించిందని, తెలంగాణ ఆవిర్భావ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదని చెబుతున్నారు. కావాలనే ఆమె దూరంగా ఉంటుండవచ్చునని అంటున్నారు.
మరోవైపు, కొండా దంపతుల మరో కార్యక్రమంలో ఉండటం వల్లనే కలవలేకపోయారని, అసహనం, అసంతృప్తిల్లాంటివేవీ లేవని మరికొందరు చెబుతున్నారు. కాగా, జిల్లాకు చెందిన ఓ వర్గం తమ పైన కేసీఆర్కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని కొండా వర్గం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications