నీళ్లు.. నిధులు.. నియామకాలు: తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయా?..
Recommended Video
హైదరాబాద్: నీళ్లు.. నిధులు.. నియామకాలు.. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ప్రాతిపదిక ఇది. వీటిని సాకారం చేసుకునేందుకే తెలంగాణ అవిశ్రాంతంగా లడాయి చేసింది. వెన్నుచూపక పోరాడింది. చివరకు గమ్యాన్ని ముద్దాడింది. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరి రేపటికి నాలుగేళ్లు. మరి తెలంగాణ ఆకాంక్షలు నెరవేరినయా?.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మారిందేంది.. మారనిదేంది?
నీళ్లు:
నిధులు.. నియామకాల కంటే నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించిందన్న అభిప్రాయం ఉన్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరిపై ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది.
గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన కాళేశ్వర, ప్రాణహిత ప్రాజెక్టులతో పాటు ఆదిలాబాదు జిల్లా సరిహద్దులో పెన్ గంగపై చనాక- కొరాటా ప్రాజెక్టుకు సంబంధించి చారిత్రక ఒప్పందం కుదిరింది. గోదావరి, ప్రాణహిత, పెనగంగ నదులపై చేపట్టే అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల కోసం ఇంటర్ స్టేట్ బోర్టును ఏర్పాటు చేసుకుంటూ ఇరు రాష్ట్రాల సీఎంలు ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఏళ్లుగా మహారాష్ట్రతో నడుస్తున్న జల వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది.
అయితే మహారాష్ట్రతో ఒప్పందం కోసం తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును తగ్గించి తెలంగాణకు నష్టం చేశారన్న విమర్శలు కూడా ప్రభుత్వంపై వినిపించాయి. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును మహా అద్భుతంగా వర్ణిస్తున్న తీరును చూస్తున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 9.3 లక్షల హెక్టార్లు ఆయకట్టు సాగులోకి వస్తుంది. తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయి. మరెన్నో రకాలుగా కూడా ప్రాజెక్టుతో మేలు జరుగనుంది. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు కూడా వేగవంతంగా నడుస్తున్నాయి.
నిధులు:
మన నిధులు మనకే అన్నది తెలంగాణ ఉద్యమంలో మరో ప్రధాన భూమికను పోషించిన అంశం. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉందని కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది. సీఎం ఎన్నో వేదికల మీద తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పారు. అయితే ఈ విషయంలో మాత్రం కొన్ని భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలైతే.. ఓవైపు అప్పులు తెస్తూనే తెలంగాణను ధనిక రాష్ట్రం అనడమేంటి? అని ప్రశ్నిస్తున్నాయి. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం వృద్దిలోకి రాలేదన్నది కేసీఆర్ సమాధానం.
నియమాకాలు:
నియామకాల విషయంలో కేసీఆర్ సర్కార్ పనితీరు ఆశించినంతగా లేదన్నది తెలంగాణ నిరుద్యోగుల అభిప్రాయం. డీఎస్సీ పోస్టుల భర్తీ విషయంలో టీఎస్పీఎస్సీ దారుణంగా విఫలమైందన్న అభిప్రాయాలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో చాలా వాటిల్లో ఏదొక లోపం తెరపైకి రావడం దాని ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. ఇంత వైఫల్యం చెందినా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణిని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారని నిరుద్యోగులు ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ప్రభుత్వం మీద అత్యంత అసంతృప్తితో రగిలిపోతున్నవాళ్లలో నిరుద్యోగులు ముందు వరుసలో ఉన్నారు. ఉస్మానియా వర్సిటీ వందేళ్ల వేడుకలో సీఎం కేసీఆర్ మాట మాత్రమైనా మాట్లాడకుండా వెనుదిరిగారంటే విద్యార్థులు, నిరుద్యోగుల సెగ ఆయనకు ఎంతలా తాకిందో అర్థం చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగ నియామకాల కంటే ఉద్యోగ విరమణ చేయాల్సిన వారిని తిరిగి కొనసాగిస్తుందన్న విమర్శలు కూడా ప్రభుత్వంపై వినిపిస్తున్నాయి.
ఇక సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. ప్రభుత్వం ఇచ్చిన హామితో.. పని దొరుకుతుందన్న భరోసాతో చాలామంది సింగరేణి కుటుంబాలతో వియ్యం కుదుర్చుకున్నారు. కోర్టు ఆ నియామకాలపై అక్షింతలు వేయడంతో కథ అడ్డం తిరిగింది. అయితే డిపెండెంట్ ఉద్యోగాలనే కారుణ్య నియమాకాల పేరుతో భర్తీ చేస్తామంటూ కేసీఆర్ హామి ఇచ్చారు. ఈ హామినైనా నిలబెట్టుకుంటారో లేదో రానున్న కాలంలో తేలిపోతుంది.
ఇకపోతే రాష్ట్ర నాలుగో ఆవిర్భావ వేడుకల వేళ.. నిరుద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చడానికా అన్నట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.