తెలంగాణ ఎన్నికల వేళ.. వివేక్ ఇంటిపై ఐటీ దాడులు
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ముగిసింది.

ఎన్నికల ప్రచారంలో తీరిక లేెకుండా గడుపుతున్నారు ఆయా పార్టీల నేతలందరూ. ఈ పరిస్థితుల్లో మరోసారి ఆదాయపు పన్నుశాఖ అధికారులు పంజా విసిరారు. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థి జీ వివేకానంద (G Vivek) ఇంటిపై మెరుపు దాడి చేశారు. పలు చోట్ల ఏకకాలంలో ఈ దాడులు ఆరంభం అయ్యాయి.
ఈ ఎన్నికల్లో ఆయన మంచిర్యాల్ జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ తెల్లవారు జాము నుంచి ఆయన ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నూరులోని వివేక్ నివాసంతో పాటు హైదరాబాద్లోని సోమాజీగూడ ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి.
వివేక్ బంధువులు, కొందరు ముఖ్య అనుచరుల ఇళ్లపైనా ఐటీ అధికారులు సోదాలకు దిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా 20 ఈ దాడులు సాగుతున్నట్లు సమాచారం. గతంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి నివాసాలపైనా దాడులు జరిగాయి.
మొన్నటివరకు జీ వివేక్.. బీజేపీలో కొనసాగారు. ఎన్నికల సమీపించిన అనంతరం ఆయన పార్టీ ఫిరాయించారు. సొంత గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. పార్టీ మారిన అతి కొద్ది రోజుల్లోనే ఐటీ అధికారులు వివేక్ ఇంటిపై దాడులకు దిగడం.. రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications