పవన్ కళ్యాణ్ రాజకీయ దూకుడు: అక్టోబర్ నుంచే, తెలంగాణలోనూ
జనసేన చీఫ్ , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్నారు.
హైదరాబాద్: జనసేన చీఫ్ , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలోపేతం చేసేదిశగా అడుగులు వేస్తున్నారు. అదే సమయంలో తమతో కలిసివచ్చే శక్తులతో కలిసి పోరాటానికి పవన్ పార్టీ చర్చిస్తోంది. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రదం పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు.
జనసేనాని , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈ ఏడాది అక్టోబర్ నుండి రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించనున్నారు.అక్టోబర్ నాటికి తన సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకొని ఇక ప్రజల సమస్యలపై పోరాటానికి ఆయన సమయాన్ని కేటాయించాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేప పార్టీ కార్యక్రమాలను ఆయన విస్తృతం చేయాలని భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పవన్ కేంద్రీకరిస్తున్నారు.అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు విషయమై ఇప్పటికే కొంత సానుకూలతను పవన్ వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై పార్టీలో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని పవన్ చెప్పారు.
మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాసంఘాలు అంతగా బలంగా లేనందున తొలుత జనసేన కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టాలని ఆ పార్టీ తలపెట్టింది.

అక్టోబర్ నుండి జనంలో పవన్ కళ్యాణ్
ఈ ఏడాది అక్టోబర్ నాటికి పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్ ను పూర్తి చేసుకొంటారు.అయితే అక్టోబర్ తర్వాత రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు.
జనసేనను బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. రాయలసీమలోని అనంతపురం జిల్లా నుండి ఆయన పోటీచేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.అయితే అదే సమయంలో సినిమాలతో పాటు రాజకీయాలను సమన్వయం చేసుకోవడం సాధ్యంకాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.అదే సమయంలో అక్టోబర్ నుండి జనసేనాని జనం బాట పట్టనున్నారు.తొలుత ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారా, తెలంగాణలో పర్యటిస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు.

తెలంగాణలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర
తెలంగాణ రాష్ట్రంలో జనసేన కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసేందుకు సిపిఎం ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ మేరకు గద్దర్, కోదండరామ్ లతో ఇతర పార్టీలను కలుపుకొని ఓ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం నాడు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మూడో ప్రత్యామ్నాయం ఏర్పాట్లపై తమ్మినేని పవన్ తో చర్చించారు.గద్దర్ కూడ పార్లమెంట్ ప్రజాస్వామ్యం వైపు మొగ్గుచూపుతున్నారు. సినీ నటుడుగా పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఉంది.అయితే ఆయన తెలంగాణలో ఆ పార్టీకి పునాది లేదు.అయితే జనసేన నిర్మాణం చేయాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.అయితే అదే సమయంలో ఇతరపార్టీలతో పవన్ జతకడితే కొంత ఆ పార్టీలకు కలిసివచ్చే అవకాశం లేకపోలేదు.అయితే మరో నష్టం కూడ ఆ కూటమి లేదా పార్టీలకు ఉంది. పవన్ కళ్యాణ్ తెలంగాణేతరుడు.అయితే టిఆర్ఎస్ ఈ అంశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మోడీని అందుకే వ్యతిరేకిస్తున్నా
అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ మతతత్వాన్ని పెంచిపోషిస్తున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే పార్టీగా ఉన్నందున 2014 ఎన్నికల్లో తాను బిజెపి నేతృత్వంలోని ఎన్ డి ఏ కూటమికి మద్దతును పలికినట్టు పవన్ కళ్యాణ్ గురువారం నాడు ప్రకటించారు.పౌరుల స్వేఛ్చను మోడీ హరించివేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీతో జగన్ సమావేశం కావడం కూడ సిపిఎం నేత తమ్మినేనితో పవన్ చర్చించారు.

పవన్ తో కలిసి పనిచేసేందుకు గద్దర్ ఆసక్తి
జననాట్యమండలి ద్వారా ఎంతో మందిని నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షించడంలో గద్దర్ బృందం ఆనాడు కీలకపాత్ర పోషించింది.అయితే చాలాకాలం పాటు గద్దర్ నక్సల్ ఉద్యమంలో పనిచేశారు.అయితే ఆయన 1990 దశకంలో జనజీవన స్రవంతిలోకి వచ్చారు.అయితే గత నెలలోనే ఆయన మావోయిస్టు పార్టీకి రాజీనామా చేశారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.అయితే ఈ తరుణంలోనే తెలంగాణలో కలిసి పనిచేసేందుకు కలిసిరావాలని గద్దర్ పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు.ఈ లేఖపై పవన్ కళ్యాణ్ నుండి ఇంకా స్పందన రాలేదు.అయితే వీరందరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు సిపిఎం ప్రయత్నాలు చేస్తామని ఇదివరకే ప్రకటించింది.

రెండు రాష్ట్రాలు సమానమే
తనకు రెండు తెలుగు రాష్ట్రాలు సమానమేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు.జనసేన పార్టీ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ సమస్యలున్నా అక్కడ పనిచేయనున్నట్టు పవన్ ప్రకటించారు.వామపక్షాలతో కలిసి పోరాటం చేసేందుకు తనకు ఇష్టమేనని చెప్పారు.అయితే ఈ విషయమై పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకొంటానని పవన్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications