జనతా కర్ఫ్యూ : 9గంటలకు కథ ముగిసినట్టు కాదు.. ఆఖరి నిమిషం తర్వాత మరో పెను సవాల్..
ఒకటి,రెండు కేసులతో మొదలై క్రమంగా ఉత్పాతానికి దారితీసేలా కనిపిస్తోన్న కరోనా వైరస్పై భారత్ ఆదిలోనే యుద్దం ప్రకటించింది. రెండో స్టేజీలోనే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం(మార్చి 22) జనతా కర్ఫ్యూ ప్రకటించడం.. ప్రజలంతా స్వచ్చందంగా ఇళ్లకే పరిమితమవడం జరిగింది. ఉదయం 7గం. నుంచి సాయంత్రం 9గం. వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అయితే 14 గంటల పాటు సంయమనంతో స్వీయ నియంత్రణతో ఇళ్లకే పరిమితమైన జనం.. ఆఖరి నిమిషం తర్వాత ఏం చేస్తారన్నదే ఇప్పుడు దేశాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. కర్ఫ్యూ తర్వాత ప్రజలు ఏమాత్రం అత్యుత్సాహంగా వ్యవహరించినా పరిస్థితులు తలకిందులయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.

9గంటలకు కథ ముగిసినట్టు కాదు
దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ రాత్రి 9గంటలకు ముగియనుంది. అయితే తెలంగాణ,మహారాష్ట్రల్లో మాత్రం సోమవారం ఉదయం 6గంటల వరకు కొనసాగనుంది. ఇక్కడ రాజకీయంగా, సామాజికంగా రెండు సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఒకటి.. తెలంగాణ సీఎం,మహారాష్ట్ర సీఎంలు ప్రకటించనట్టుగా.. అక్కడి ప్రజలంతా 24గంటల పాటు కర్ఫ్యూని పాటిస్తారా.. లేక ప్రధాని మోదీ చెప్పిన 14గంటల కర్ఫ్యూకే పరిమితమవుతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రెండు.. బీజేపీ మద్దతుదారులు,కింది స్థాయి శ్రేణులు.. సీఎం కేసీఆర్ సూచనను కాకుండా మోదీ సూచనకే పరిమితమై 9గంటల తర్వాత బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే ప్రధాని మోదీ 14 గంటల కర్ఫ్యూ ప్రకటన, ముఖ్యమంత్రులు కేసీఆర్,ఉద్దవ్ థాక్రేల 24గంటల కర్ఫ్యూ ప్రకటన... తెలంగాణ,మహారాష్ట్ర ప్రజల్లో కాస్త గందరగోళానికి తెరలేపే అవకాశం ఉంది. సమాచారం పూర్తిగా చేరనివారు.. లేక కాస్త అత్యుత్సాహం ప్రదర్శించేవారు.. 9గంటల తర్వాత ఇంటి నుంచి రోడ్ల పైకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఒకరిని చూసి.. మరొకరు..ఎక్కువమంది రోడ్ల పైకి రావచ్చు.

అదే జరిగితే సోషల్ డిస్టెన్స్కు విఘాతం
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో యావత్ దేశమంతా సాయంత్రం 5గంటలకు ఐదు నిమిషాల పాటు చప్పట్లు,గంటలు మోగించింది. అదే సమయంలో కొంతమంది చప్పట్లకు బదులు అత్యుత్సాహంతో బాణసంచా పేల్చారు. వైరస్ నియంత్రణ కోసం అంతా మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటిస్తున్న వేళ.. ఇలా బాణసంచా కాల్చడం లేని సమస్యలను సృష్టించడమే అవుతుంది. ప్రజలంతా ఒకరోజు ఇంటికే పరిమితమై వైరస్ నియంత్రణతో పాటు కాలుష్యాన్ని తగ్గించారని చెప్పవచ్చు. కానీ ఇలా బాణసంచా పేల్చడం ద్వారా 14 గంటల పాటు పాటించిన స్వీయ నియంత్రణ వృథా అవుతుందనే చెప్పాలి. రాత్రి 9గంటల తర్వాత దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ముగియనుండటంతో.. ఆఖరి నిమిషం తర్వాత కొంతమంది అత్యుత్సాహంతో బాణసంచా పేల్చే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో మరికొంతమంది అప్పటిదాకా పాటించిన సంయమాన్ని పక్కనపెట్టి గుంపుగుంపులుగా రోడ్ల పైకి రావచ్చు. అదే జరిగితే సోషల్ డిస్టెన్స్కి విఘాతం కలిగి వైరస్ వ్యాప్తికి అవకాశం కల్పించినట్టవుతుంది.

కర్ఫ్యూ తర్వాత కూడా సంయమనం అవసరం.. తెలంగాణ ప్రజలు ఆ విషయం గుర్తుంచుకోవాలి..
జనతా కర్ఫ్యూ పాటించినంత సేపు ఎంత సంయమనంతో ఇంటికే పరిమితమయ్యారో.. అదే నిబద్దతను ప్రజలు తర్వాత కూడా పాటించాల్సి ఉంటుంది. 9గంటలకు కర్ఫ్యూ ముగియగానే.. అంతా ఒకచోట చేరి సంబరాలు చేసుకోవడమో.. లేక గుంపులు గుంపులుగా రోడ్ల పైకి వెళ్లడమో చేయవద్దు. అలాగే బాణసంచా కూడా కాల్చవద్దు. ఇక తెలంగాణ,మహారాష్ట్రల్లో 24గంటల కర్ఫ్యూని ప్రజలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఏపీలోనూ కర్ఫ్యూ పొడగించే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి. అలా కాకుండా నిర్లక్ష్యం,అత్యుత్సాహంతో కర్ఫ్యూని బ్రేక్ చేస్తే సమాజం మొత్తాన్ని రిస్క్లోకి నెట్టినవారు అవుతారు. కాబట్టి కర్ఫ్యూ తర్వాత కూడా ప్రజలు అదే సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.

లాక్ డౌన్ దిశగా భారత్
మరోవైపు భారత్ లాక్ డౌన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. అలాగే దేశవ్యాప్తంగా మార్చి 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. మహారాష్ట్రలో 144 సెక్షన్ను కూడా విధించారు. అటు కర్ణాటక ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన 8 జిల్లాల్లో రెండు నెలల పాటు రేషన్ సరుకులను ఇళ్లకే సరఫరా చేస్తామని ప్రకటించింది.
ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టు ప్రజలంతా మున్ముందు ఇళ్లకే పరిమితమయ్యే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే దేశవ్యాప్తంగా అన్ని రకాల ఉత్పత్తులు నిలిచిపోయి అతి పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. ఓవైపు వైరస్ నియంత్రణ.. మరోవైపు ప్రజల నిత్యావసరాలు తీర్చాల్సిన బాధ్యత.. ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత.. ఈ విపత్కర పరిణామాలన్నింటినీ భారత్ ఎదుర్కొంటుందన్నదే ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాల్.












Click it and Unblock the Notifications