భారీ 'రెడ్ లైట్' ఆపరేషన్: ఆ ఒక్క ఊళ్లో 150మంది వేశ్యలు..
మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం జప్తిశివనూరులో 150 మంది వేశ్యలను పోలీసులు పట్టుకున్నారు.
మెదక్: రాత్రివేళ.. మూడు బస్సులు.. 20కార్ల నిండా పోలీసులు ఆ ఊరిలో వాలిపోయారు. ఊరు ఊరునంతా జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. చివరికి వారు అనుకున్న ఆపరేషన్ సక్సెస్ అయింది. అయితే ఇదంతా ఏ కరుడుగట్టిన ఉన్మాదినో.. లేక ఏ అంతర్జాతీయ ఉగ్రవాదినో పట్టుకోవడానికి చేసింది కాదు. వేశ్యల కోసం పోలీసులు జరిపిన వేట ఇది.
నమ్మశక్యంగా లేకపోయినా నమ్మి తీరాల్సిన వాస్తవం ఇది. మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం జప్తిశివనూరులో 150 మంది వేశ్యలను పోలీసులు పట్టుకున్నారు. ఊళ్లో ఎక్కువమంది వేశ్యా వృత్తి పైనే ఆధారపడి జీవిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా పోలీసుల దాడుల్లో ఇద్దరు లేదా ముగ్గురు మహా అయితే మరో ఐదారుగురు వేశ్యలు పట్టుబడటం చూస్తుంటాం.. కానీ ఇంత భారీ సంఖ్యలో వేశ్యలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. భారీ సంఖ్యలో వేశ్యలు పట్టుబడటంతో ఇంతకాలం మారుమూల గ్రామంగా మాత్రమే తెలిసిన జప్తిశివనూరు.. ఇప్పుడు వేశ్యలు పట్టుబడిన గ్రామంగా మారుమోగిపోతోంది.
అయితే పోలీసులకు ఇన్నాళ్లు ఈ విషయం తెలియదా? బుధవారం రాత్రే ఇంత భారీ ఆపరేషన్ కు ఎందుకు స్కెచ్ వేశారన్నది తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్ కోసం పోలీసులంతా మఫ్టీలోనే ఆ గ్రామానికి వెళ్లినట్లు సమాచారం.