రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ , బండి సంజయ్ కు దమ్ముందా : పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి
టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూరు ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు టిఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్సీ మల్లేశంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ దందా ఎవరిని అడిగినా చెబుతారని విమర్శించారు. మల్లారెడ్డి టు మై హోమ్.. మేఘ టు నవయుగ వరకు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ దందాను ప్రతి ఒక్కరికీ తెలుసని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హోల్ సేల్ బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ తీవ్రపదజాలంతో ద్వజమెత్తారు.
ఏపీ తెలంగాణా విద్యుత్ బకాయిల రగడ : తెలంగాణా బకాయిల కోసం కోర్టు మెట్లెక్కిన ఏపీ ; ఎవరివాదన వారిదే !
టిఆర్ఎస్ పార్టీ డేటాతో మాట్లాడితే రేవంత్ రెడ్డి నోటి తీటతో మాట్లాడతాడు
ఇదే సమయంలో టిఆర్ఎస్ పార్టీ డేటాతో మాట్లాడితే రేవంత్ రెడ్డి నోటి తీటతో మాట్లాడతాడని నిప్పులు చెరిగారు. డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ అని ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోవద్దని హితవు పలికారు జీవన్ రెడ్డి. బ్లాక్ మెయిలింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని, ఐటీకి, నవయువ తెలంగాణకు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని జీవన్ రెడ్డి కితాబిచ్చారు.
తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్ కు కూడా
గతంలో కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో రౌడీషీటర్లు రాజ్యమేలేవారని పేర్కొన్న జీవన్ రెడ్డి, కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రౌడీ వ్యవస్థ బాగా తగ్గిందని, సింగపూర్, బ్యాంకాక్ తరహాలో తెలంగాణ పోలీసులు క్రైం కంట్రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి కూడా పట్టబోతుంది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడితే సహించేది లేదంటూ తేల్చి చెప్పారు.
బండి సంజయ్ కు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం నుండి నిధులు తీసుకురా
ఇదే సమయంలో బిజెపిని, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి బండి సంజయ్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న జిల్లాలలో ప్రజలను రాకపోవడంతో ఇతర జిల్లాల నుండి ప్రజలను పాదయాత్రకు తరలిస్తున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న బండి సంజయ్ కు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం నుంచి 20 వేల కోట్లు తెచ్చి రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని సవాల్ విసిరారు.
టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం .. సవాల్ విసిరిన జీవన్ రెడ్డి
సింగరేణి కాలనీ లో జరిగిన ఘటన దురదృష్టకరమైన ఘటన అని, నిందితుడికి కఠిన శిక్ష పడేలాగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు సవాల్ విసిరారు జీవన్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇస్తున్నారా అని ప్రశ్నించిన ఆయన, అభివృద్ధి పై ఏ వేదిక పైన చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తెలంగాణ రథసారథులు చర్చకు రావాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తాగుబోతులా ? జీవన్ రెడ్డి ప్రశ్న
బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎక్సైజ్ ఆదాయాలు ఉన్నాయని, అంతమాత్రాన అక్కడి సీఎంలు తాగుబోతులా అంటూ ప్రశ్నించారు జీవన్ రెడ్డి. హుజురాబాద్ ఎన్నికలే కాదు రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని బల్ల గుద్ది మరీ చెప్పారు. సీఎం కేసీఆర్ ను అకారణంగా దూషిస్తే సహించేది లేదని పేర్కొన్న జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇద్దరి మీద విమర్శల వర్షం కురిపించారు.