తెలంగాణలో ఆంధ్రవాళ్ళకి ఉద్యోగాలా.?జీవో రద్దు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తామన్న జేఏసీ నేతలు.!
హైదరాబాద్ : పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో గతంలో కర్ణాటక వాళ్ళతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు నింపారని, ఆ దుర్మార్గాన్ని మరవకముందే మళ్ళీ ఆంధ్రవాళ్ళకి ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామక ఉత్తర్వులు ఇచ్చారని, ఈ విధంగా తెలంగాణ పోరాట స్ఫూర్తిని మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మూల సూత్రాలను దెబ్బతీస్తే సహించమని నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ బిడ్డలను కాదని చేసిన అక్రమ నియామాకాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం విసి రవీందర్ రెడ్డి చాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు జెఏసి నేతలు.
ఈ సందర్భంగా నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్ మాట్లాడారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లలో రోస్టర్ పద్ధతిని పాటించకుండా ఇచ్చిన నియామక ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని మానవతారాయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగులకు దక్కాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్లకి కట్డబెట్డటం అనైతికం అని అన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది ఆంధ్రవాళ్ళకి ఉద్యోగాలు కట్టబెట్టటానికా అని ఆగ్రహం వ్యక్తం చేసారు మానవతారాయ్. స్థానికేతరులకి ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేయకుంటే తెలంగాణ అమరుల ఆశయ సాధనకోసం ఆమరణ దీక్ష చేస్తామని ప్రకటించిన మానవతారాయ్. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవల 113 నాన్ టీచింగ్ అక్రమ నియామకాలను రద్దు చేసిన విధంగా పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అక్రమ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ నియామక ఉత్తర్వులను రద్దు చేయాలని విసి ని కలిసి డిమాండ్ చేసారు జేఏసీ నేతలు.