విషాదం: రోడ్డుప్రమాదంలో సీనియర్ పాత్రికేయుడు మృతి
కరీంనగర్: మానకొండూరులో బుధవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో వరంగల్ ఈనాడు డెస్క్ సారథి ఠాకూర్ గణేష్ సింగ్(40) దుర్మరణం చెందారు. మానకొండూరు ఎస్సై ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్ మండలం రేకుర్తి గ్రామంలోని గ్రీన్హోం కాలనీలో నివాసముంటున్న ఠాకూర్ గణేష్ సింగ్ వరంగల్లోని ఈనాడు కార్యాలయంలో డెస్క్ ఇంఛార్జిగా పనిచేస్తున్నారు.
బుధవారం అర్థరాత్రి కార్యాలయంలో విధులు ముగించుకున్న ఆయన కారులో కరీంనగర్ బయలుదేరారు. మానకొండూరు మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్బంకు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, చాతీభాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఆయన్ని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన గణేశ్ సింగ్ నిజామాబాద్ జిల్లాలో ఉప సంపాదకుడిగా, కరీంనగర్, గుంటూరు గ్రామీణం, వరంగల్ జిల్లా డెస్క్ సారథిగా పనిచేశారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి: ఇద్దరికి గాయాలు
రాంపూర్లో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రంజిత్(24) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంజిత్, వెంకటేశ్, మౌనికలు ద్విచక్రవాహనంపై స్టేషన్ఘన్పూర్ నుంచి రాంపూర్ మీదుగా మడికొండ వైపు వెళ్తున్నారు. రాంపూర్లో వెనుక నుంచి వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
ఈ సంఘటనలో రంజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వెంకటేశ్, మౌనికలను 108 అంబులెన్స్లో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు సీఐ రాజయ్య తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సైలు విజయ్ రామ్కుమార్, కుమారస్వామిలు పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును హంటర్రోడ్డులో పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజయ్య తెలిపారు.
మరో ప్రమాదంలో...
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిలో నిడిగొండ వద్ధ బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. లింగాలఘనపురం మండలం పటేల్గూడెం గ్రామానికి చెందిన పగడిపల్లి వెంకటేశ్(27), వడిచర్లల గ్రామానికి చెందిన మందుగుల సాయి(23) నిడిగొండ నుంచి ద్విచక్రవాహనంపై జనగామకు వెళ్తున్నారు.
నిడిగొండ బస్టాండు సమీపంలో హన్మకొండ వైపు వెళ్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్కు కాలు విరిగిపోగా, సాయికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
విద్యార్థులకు అస్వస్థత
అస్వస్థతతో హసన్పర్తి మైనార్టీ బాలికల వసతి గృహానికి చెందిన 12 మంది విద్యార్థినులు మంగళవారం ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారిని స్థానిక వైద్యులకు చూపించిన ఫలితం లేక పోవడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించినట్లు వసతిగృహ అధికారులు తెలిపారు.