పవన్ సుఖంగా ఉండొచ్చు, కోరి కష్టాలు, మీరు మీరూ తేల్చుకోండి: మోడీకి జేపీ చురకలు
హైదరాబాద్: విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరాలని, అందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి తాను మద్దతు ఇస్తున్నానని లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (జేపీ) గురువారం అన్నారు.
Recommended Video

పవన్ కళ్యాణ్ ఆయనను మధ్యాహ్నం కలిసిన విషయం తెలిసిందే. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, రెండు తెలుగు రాష్ట్రాలకు ఏం ఇచ్చారు, ఏం ఇవ్వలేదనే అంశాలపై వారిద్దరు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్టంలో లేవు కాబట్టి మా ఇష్టమని, ఏరుదాటాక తెప్పతలగేయవద్దని, ఏపీకి పన్ను మినహాయింపు ఎందుకివ్వరని జేపీ.. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ హాయిగా బతకొచ్చు కానీ
లక్షలాది అభిమానులు ఉన్న సోదరుడు పవన్ కళ్యాణ్ సుఖంగా, హాయిగా బతకవచ్చునని, కానీ ఆయన కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారని జేపీ అన్నారు. రిటైర్మెంట్ సమయంలో కాకుండా చిన్న వయస్సులో ఆయన ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు న్యాయం చేయాలనే ఆకాంక్ష, బలమైన కాంక్షతో ఆయన ముందుకు వచ్చారన్నారు. అందుకు ఆయనను మనసారా అభినందిస్తున్నానని చెప్పారు.

ఏపీని ఎలా విభజించారో మోడీ చెప్పారు
ఏపీని ఎలా విభజించారో మనం నిన్న ప్రధాని మోడీ కూడా సభలో చెప్పగా చూశామన్నారు. పార్లమెంటులో చట్టం చేశాక, దానిని విస్మరించడం అంటే ఏరు దాటాక తెప్పతగలేయడమే అని, ఇది ప్రమాదకరమని జేపీ అన్నారు. ప్రధాని నుంచి ఆర్థిక మంత్రి వరకు ఇచ్చిన హామీల్లో కొన్ని జరిగాయని, అన్నీ జరగలేదన్నారు. వీటిని సమీక్షించుకోవాలన్నారు.

పవన్ కళ్యాణ్కు మద్దతు, దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే
విభజన హామీలపై పవన్ కళ్యాణ్ ఆలోచించడం మంచిది అని జేపీ అన్నారు. తాను పూర్తిగా మద్దతిస్తున్నానని చెప్పారు. అందరితో కలిసి పవన్ సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారన్నారు. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలేనని, కాబట్టి అందరూ కలిసి రావాలన్నారు. ఏపీలో రైల్వే జోన్ నుంచి, తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు వరకు పలు హామీలు నెరవేరలేదన్నారు.

ఏపీ, తెలంగాణలకు న్యాయం జరగాలి
రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలని జేపీ అన్నారు. ఇందుకోసం అందరూ కలిసి రావాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సామరస్య వాతావరణం వెల్లువిరుస్తోందని, అందుకు ఇరు రాష్ట్రాల అధినేతలను (చంద్రబాబు, కేసీఆర్)లను అభినందిస్తున్నానని చెప్పారు. రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్నారు.

మోడీకి చురకలు
విభజన సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు కాబట్టి వాటిని అమలు చేయాలని జేపీ డిమాండ్ చేశారు. చిత్తశుద్ధితో అందరు కలిసి రావాలని నేను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. చట్టంలో లేవు కాబట్టి మాకు సంబంధం లేదనడం ధర్మం కాదని చెప్పారు. ఏపీకి ఆర్థికంగా జరగాల్సింది జరగలేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగాలంటే తన వల్లే, ఒక్క పవన్ వల్లో కాదని, అందరు కలిసి రావాలన్నారు.

మీరు మీరు తేల్చుకోండి
వెనుబడ్డ ప్రాంతాలను గుర్తించి బుందేల్ఖండ్ తరహాలో సాయం చేస్తామని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారని జేపీ గుర్తు చేశారు. బుందేల్ఖండ్కు తలసరి నాలుగువేల రూపాయలు వచ్చిందని, కానీ ఏపీకి అలా రాలేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్క లేదు కాబట్టి మేం నిధులు ఇవ్వడం లేదని కేంద్రం చెబుతోందంటే.. అది మీరు మీరు (కేంద్రం, ఏపీ ప్రభుత్వం) తేల్చుకోవాలని, ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తారని ప్రశ్నించారు. ప్రజలను బలి చేయవద్దన్నారు. తమకు రూ.10వేల కోట్లు వచ్చాయని చెబుతున్నారని, తమకు రాజకీయాలు అనవసరమని, ఏపీని ఆదుకోవడం ముఖ్యమన్నారు.

ఏపీకి పన్ను రాయితీ ఎందుకివ్వరు
ఆర్థికపరమైన అంశాలు, అభివృద్ధి విషయంలో ఏపీకి న్యాయం జరగాలని జేపీ అన్నారు. మీ రాజకీయాల కోసం ప్రజలను ఉబ్బంది పెట్టవద్దని చెప్పారు. రూ.10వేల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఏపీకి పన్ను రాయితీ ఎందుకివ్వరని ప్రశ్నించారు. విభజనతో దెబ్బతిన్న ఏపీకి న్యాయం జరగాలన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. అందరు కూర్చొని వేదిక ఏర్పాటు చేద్దామన్న పవన్ ఆలోచన మంచిదన్నారు. గంటలో సమస్యను పరిష్కరించడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.












Click it and Unblock the Notifications