జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: నిందితులకు రిమాండ్, నేరానికి వాడిన ఆ ఇన్నోవా కారు గుర్తింపు
హైదరాబాద్: రాష్ట్రంలో కలకలం రేపిన జూబ్లీహిల్స్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఇప్పటి వరకూ ఇద్దరు మైనర్లతో పాటు సాదుద్దీన్ మాలిక్ను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఆ ముగ్గురు నిందితులను రిమాండ్కి తరలించారు. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో సాదుద్దీన్ మాలిక్ను విచారించిన పోలీసులు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ కేసు నిందితులకు రిమాండ్
ఆ తర్వాత, వనస్థలిపురంలోని నాయమూర్తి ఇంట్లో సాజిద్ను హాజరుపరిచారు. సాజిద్కు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. చంచల్గూడ జైలుకు తరలించారు.అరెస్టయిన మరో ఇద్దరు నిందితులైన ప్రభుత్వ సంస్థ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కుమారునితో పాటు ఇంకో మైనర్ను పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి, వారిని జువెనైల్ హోంకి తరలించారు. ఇక, పరారీలో ఉన్న ఇంకో ఇద్దరు నిందితులు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిని కర్ణాటకలో ఆదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు.. రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో ఉమర్ ఖాన్తో పాటు మరో మైనర్ కూడా ఉన్నాడు. వారిని ఆదివారం రిమాండ్కు తరలించనున్నట్టు సమాచారం.
నిందితులు వాడిన ఇన్నోవా కారు గుర్తింపు
మరోవైపు, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇన్నోవా కారును పోలీసులు గుర్తించారు. మొయినాబాద్లో ఆ ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇన్నోవా కారును జూబ్లీహిల్స్ పీఎస్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. అయితే, అత్యాచారానికి పాల్పడ్డ కారు ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నిలకడగా బాధితురాలి ఆరోగ్య పరిస్థితి
కేసులో ఇప్పటికే బాలికకు భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఎఫ్ఎస్ఎల్కి పంపారు. ప్రస్తుతం బాలికకు ఆరోగ్యంగా ఉందని పోలీసులు వెల్లడించారు.కేసులో కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజ్పై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని మొదట భావించిన పోలీసులు.. ఈ మొత్తం ఘటనలో ఐదుగురు మాత్రమే పాల్గొన్నట్లు తేల్చారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీల నేతలు అధికార పార్టీ, తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఫేర్వెల్ పార్టీ కోసం కార్పొరేట్ స్కూల్ పేరిట పబ్ బుకింగ్
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. అమ్నీషియా పబ్లో నగరానికి చెందిన ఒక కార్పొరేట్ విద్యా సంస్థకు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నారు. దీని కోసం అసిఫ్ అనే విద్యార్థి కార్పొరేట్ విద్యా సంస్థ నుంచి లెటర్ హెడ్ కూడా తీసుకొచ్చి, పార్టీకి అనుమతి తీసుకున్నారు. మే 28న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 150 మంది విద్యార్థులు పబ్లో పార్టీ చేసుకున్నారు. నాన్ ఆల్కహాల్, నాన్ స్మోకింగ్ జోన్లో ఈ పార్టీ జరిగింది. నిషాన్, ఆదిత్య, ఇషాన్, అసిఫ్ ఈ పార్టీకి పబ్ బుక్ చేశారు. దీని కోసం దాదాపు 2 లక్షల రూపాయలు చెల్లించారు. పార్టీకి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
మరోవైపు, జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై ఆబ్కారీ శాఖ ఆరా తీస్తోంది. మైనర్లను పబ్లోకి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీన వారిని ఎలా అనుమతించారని ప్రతి పక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆబ్కారీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మైనర్లను పబ్లోకి ఎలా అనుమతించారనే విషయంపై ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతోపాటు పబ్ యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు.