ఓటుకు నోటు: ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వంతు, గన్మెన్ను ప్రశ్నించిన టీ ఏసీబీ
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు దర్యాప్తులో తెలంగాణ ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, పలువురిని తమ కార్యాలయానికి రప్పించి ఏసీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.
తాజాగా గురువారం హైదరాబాద్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గన్మెన్ రాంబాబును ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారం సేకరించాల్సి ఉందని సాక్షిగా తమ ఎదుట హాజరు కావాల్సిందిగా గన్మెన్ రాంబాబుకు నోటీసులిచ్చారు.
నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గన్మెన్ గురువారం ఏసీబీ అధికారుల ముందు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా రాంబాబును ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసు జరిగిన సమయంలో మీ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరిని కలిశారు? ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారు? లాంటి ప్రశ్నలతో ఏసీబీ అధికారులు రాంబాబును విచారించినట్లు సమాచారం.
గత మంగళవారం దివంగత మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు తనయుడు శ్రీనివాస్నాయుడుతోపాటు ఆయన సహాయకుడు విష్ణుచైతన్య బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. శ్రీనివాసులు బెంగుళూరులోని కర్నాటక బెవరేజేస్ అండ్ డిస్టిల్లరీస్కు ఎండీగా శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు.
రేవంత్రెడ్డికి యాభై లక్షలు సమకూర్చారనే ఆరోపణలు ఉండటంతో శ్రీనివాస్నాయుడు తెలంగాణ ఏసీబీ అధికారులు విచారించారు. ఇక ఇప్పటికే ఈ కేసులో నోటీసులు అందుకున్న చంద్రబాబు తనయుడు లోకేష్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డి, జిమ్మిబాబు ఇప్పటికీ విచారణకు హాజరు కాలేదు.
ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు 50 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వజూపుతూ రెడ్ హ్యాండెడ్గా రేవంత్రెడ్డి దొరికినా, 'మిగిలిన నాలుగున్నర కోట్లు' చుట్టూ ఏసీబీ విచారణ కొనసాగుతోంది.
ఈ కేసులో ఇప్పటికే రేవంత్రెడ్డి అరెస్టయ్యారు. ఆయనతోపాటు మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యనూ ఏసీబీ అరెస్ట్ చేసింది. బెయిల్పై వీరిద్దరూ విడుదలైన సంగతి తెలిసిందే.